తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయం ఆ పార్టీ సీనియర్ నాయకుల నుంచి జూనియర్ నాయకులు వరకు అందరిలోనూ కనిపిస్తోంది.ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేయడంతో పాటు , ఇటీవల నిర్వహించిన వరంగల్ సభకు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ హాజరైన సందర్భంగా పార్టీ నాయకులకు అనేక అంశాలపై కీలక సూచనలు చేయడంతో వారిలో ఉత్సాహం కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ను క్షేత్రస్థాయి లోకి తీసుకు వెళ్లేందుకు ఆ పార్టీ నాయకులు అంతా డిసైడ్ అయిపోయారు.ముఖ్యంగా వరంగల్ డిక్లరేషన్ లో తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
దీనిలో భాగంగానే ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన టి.పిసిసి విస్తృతస్థాయి సమావేశం జరగబోతోంది.
దీనిలో ప్రధానంగా రైతుల డిక్లరేషన్ పై జనాల్లోకి ఏ విధంగా వెళ్లాలి అనే అంశం పైన ప్రధానంగా చర్చించనున్నారు.ముఖ్యంగా 300 మంది నాయకులతో డిక్లరేషన్ పై జనం లోకి వెళ్లాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
ఒక్కో నాయకుడికి 30 నుంచి 40 గ్రామాల బాధ్యతను అప్పగించబోతున్నట్లు సమాచారం.ఈ కార్యక్రమానికి ‘ పల్లెపల్లెకు కాంగ్రెస్ ‘ పేరును ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఒకవైపు పల్లెపల్లెకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే… రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ సభను ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే విషయంపై ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా చర్చిస్తున్నారు.పల్లె పల్లె కు కాంగ్రెస్ ను విజయవంతం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా డిసైడ్ అయ్యారట.వరుసగా ఈ తరహా కార్యక్రమాలు చేపడుతూ నే టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, పెరిగిన ధరలు, నిరుద్యోగం వంటి అంశాలను జనాల్లోకి తీసుకెళ్లాలని, అలాగే బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా ఇప్పుడు సిద్ధం అవుతున్నారు.