ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం పొత్తు పొడుపులు, దెప్పి పొడుపులు నడుస్తున్నాయి.రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.
శాశ్వత మిత్రులు ఉండరు.అలాగే శాశ్వత శత్రువులు కూడా ఉండరు.
ఏ పార్టీ ఎప్పుడు ఎవరితో జత కడుతుందో చెప్పలేం.కాంగ్రెస్ పార్టీతో తెలుగు దేశం పార్టీ జత కడుతుందని ఎవరైనా ఊహించారా.
కానీ 2018లో తెలంగాణ రాజకీయాల్లో ఈ సీన్ చోటుచేసుకుంది.
రాజకీయాల్లో పొత్తులు ఏ పార్టీల మధ్య ఏర్పడతాయో అనలిస్టులు కూడా ఊహించలేరు.
రాజకీయాల్లో ఎవరితో అవసరం ఉంటే వారితో కలవడం.ఎవరితో అవకాశం వస్తే వారితో చేతులు కలపడం అనేది రివాజుగా మారిపోయింది.
ప్రస్తుతం ఏపీలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది.గతంలో బీజేపీని వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ వైపు చూస్తోంది.ఈ రెండు పార్టీలకు జనసేన పార్టీ వారధిగా నిలుస్తోంది.
2019 ఎన్నికల తర్వాత బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది.అయితే ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేసిన దాఖలాలు లేవు.పేరుకు బీజేపీతో పొత్తులో ఉన్నట్లు కనిపిస్తున్న జనసేన పార్టీ.
రియాల్టీలో టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు రెడీ అవుతోందన్న టాక్ నడుస్తోంది.అందుకే బీజేపీతో పవన్ కళ్యాణ్ అంటీ అంటన్నట్లు వ్యవహరిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.
ఇటీవల జనసేన పార్టీ ఆవిర్భావ సదస్సులో పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని శపథం చేశారు.అదే సమయంలో వైసీపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసేలా తాను చక్రం తిప్పుతానని కూడా ప్రకటించారు.అయితే బీజేపీకి పవన్ ఎందుకు దూరంగా ఉంటున్నారనే విషయంలో అయోమయం ఏర్పడింది.ఏడాదిన్నరగా కేంద్రంలోని బీజేపీ పెద్దలను పవన్ కలుసుకున్న దాఖలాలు లేవు.రెండు పార్టీల మధ్య బంధాన్ని పటిష్టం చేసేందుకు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లడం లేదు.ఒకవేళ బీజేపీ పెద్దలు హైదరాబాద్ వచ్చినా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ వారికి చిక్కడం లేదు.
వారితో కనీసం మర్యాద పూర్వకంగా కూడా భేటీ కావడం లేదు.
దీంతో బీజేపీ, జనసేన పొత్తుపై పలువురికి అనుమానాలు తలెత్తుతున్నాయి.మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని నొక్కి చెప్తున్నారు.టీడీపీ కుటుంబ పార్టీ అని ఆయన ఆరోపిస్తున్నారు.
కానీ బీజేపీతో సంబంధాలను బలోపేతం చేసుకునే అజెండాను పవన్ కళ్యాణ్ పూర్తిగా పక్కనపెట్టేసి టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు.అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా అనే విషయంపై మూడు పార్టీల వైపు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
.