ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్ లోకి పూర్తిగా వెళ్ళిపోయాయి.త్వరలోనే సర్వత్ర ఎన్నికలు రాబోతూ ఉండడం, ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉంది.
అయితే ఈ లోగా సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రచారం ఓ వైపు నడుస్తూ ఉండడంతో, అన్ని పార్టీలు ముందుగానే అలెర్ట్ అవుతూ , రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నాయి.ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పై చేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో అన్ని రాజకీయ పార్టీల మధ్య వైరం మరింత పెరిగి పోయినట్టుగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలోనే ఈనెల 28వ తేదీన తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదికపైకి రాబోతున్నాయి. కార్యక్రమానికి తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరు కాబోతున్నారు.దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే… అమెరికాలోని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ( టి టి ఎ ) ఈ డిబేట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది.
దీనిని న్యూజెర్సీలోని ఎడిసన్ లో ఉన్న న్యూజెర్సీ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పోసిషన్ సెంటర్ లో మే 28 న నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కు చెందిన మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు , ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొనబోతున్నారు.
అలాగే కాంగ్రెస్ నుంచి టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పాల్గొనబోతున్నారు.
బీజేపీ నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎంపీ వివేక్ వెంకటస్వామి , మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులు హాజరు కాబోతున్నారు.ఈ సందర్భంగా ఈ 28న వీరి మధ్య తెలంగాణలోని వివిధ రాజకీయ అంశాలకు సంబంధించిన చర్చ జరగబోతోంది.ఈ సందర్భంగా ఈ డిబేట్ లో అనేక అంశాలు ప్రస్తావనకు రావడంతో పాటు , అనేక అంశాలపై చర్చ జరగనుంది.