వైసిపి కి సంబంధించి పార్టీలోను, ప్రభుత్వంలోను అనేక కీలక మార్పులు గత కొద్ది రోజులుగా చోటుచేసుకుంటునే ఉన్నాయి.అలాగే ప్రస్తుతం మంత్రివర్గంలో మార్పు చేర్పులు చేపట్టేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలోనే ఏపీ క్యాబినెట్ ను ప్రక్షాళన చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు.అది మరికొద్ది రోజుల్లోనే పూర్తి కాబోతోంది.
అయితే మొత్తం మంత్రి మండలిని పూర్తిగా జగన్ ప్రక్షాళన చేస్తారా ? లేక కొంతమంది మంత్రులను యధావిధిగా కొనసాగిస్తారా అనేది ఇప్పటివరకు మంత్రులకు సైతం క్లారిటీ లేదు .ఇది ఇలా ఉంటే సీనియర్ పొలిటిషన్ వైసీపీలో కీలక నేతగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట.ఇదే విషయమై జగన్ వద్ద ప్రస్తావించగా, ఆయన కూడా దీనికి అంగీకారం తెలిపినట్లు సమాచారం.
ప్రస్తుతం ఏపీ లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జాతీయ రాజకీయాల్లో ఉండడమే బెటర్ అని, అలాగే మంత్రి పదవిలో ఎంతకాలం కొనసాగుతామో లేదో తెలియని పరిస్థితి ఉండడంతో , రాజ్యసభ వైపే బొత్స చూస్తున్నారట.
ప్రస్తుతం విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబీకులు కీలకమైన పదవులు అనుభవిస్తున్నారు.ఒకవేళ మంత్రి పదవి పోతే వారందరికీ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. పార్టీలోని వైరి వర్గం కూడా బలపడే అవకాశం ఉండడంతో, రాజ్యసభ వైపు వెళ్లాలని బొత్స సత్యనారాయణ డిసైడ్ అయ్యారు.ఈ మేరకు జగన్ ను ఒప్పించినట్లు సమాచారం.
ఇంత వరకు బాగానే ఉన్నా, బొత్స ను రాజ్యసభకు పంపినా, పార్టీ, ప్రభుత్వం తరఫున ఆయన వాయిస్ వినిపించే అవకాశం లేదు.ఎందుకంటే ఆయనకు ఇంగ్లీష్ , హిందీ పై అంతగా పట్టు లేకపోవడమే కారణం.ఈ సీనియర్ మంత్రి విషయంలో జగన్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.