నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజకీయ వ్యవహారం అటో ఇటో తేలి పోయే సమయం వచ్చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు ఆ పార్టీ అధినేత జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ , గత కొంతకాలంగా హడావుడి చేస్తున్నారు.
జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయంపైనా, విమర్శలు చేస్తున్నారు.మా ముఖ్యమంత్రి అంటూనే జగన్ పాలన పై సెటైర్లు వేస్తున్నారు.
రఘు రామ వ్యవహారం వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది.ఆయనపై అనర్హత వేటు వేయాల్సింది గా అనేక సార్లు లోక్ సభ స్పీకర్ కు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు.
ఢిల్లీ బిజెపి పెద్దల పైనా ఇదే విషయమై ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు.ఇక తనపై అనర్హత వేటు ఫిబ్రవరి మొదటి వారంలోగా వేయించాలని , లేకపోతే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి నరసాపురం నుంచి మళ్లీ పోటీ చేస్తానంటూ రఘురామ సవాల్ చేశారు.
ఈ వ్యవహారం ఈ విధంగా ఉత్కంఠ రేపుతుండగా, తాజాగా లోక్ సభ స్పీకర్ కు వైసిపి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఇచ్చిన అనర్హత పిటిషన్ పై స్పందించారు.రఘురామకృష్ణంరాజు అనర్హత పిటిషన్ పై లోక్ సభ స్పీకర్ విచారణకు ఆదేశించారు.
ఈ అనర్హతపై తేల్చాల్సింది గా ప్రివిలేజ్ కమిటీకి సూచించారు.రఘురామకృష్ణంరాజు తో పాటు బెంగాల్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ శిశిర్ అధికారి అనర్హత పిటిషన్ కూడా విచారణకు ఆదేశించారు.
ఆయన తృణమూల్ నుంచి నేరుగా బీజేపీలో చేరిపోయారు.రఘురామ మాత్రం వైసిపి లోనే ఉంటూ రెబల్ గా మారి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
కానీ ఎక్కడా పార్టీపై విమర్శలు చేయడం లేదు.అయితే ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం పార్టీ మారితేనే అనర్హత వేటు పడుతుంది.కానీ రఘురామ పార్టీ మరకపోవడం తో ఆయనకు అనర్హత వర్తిస్తుందా లేదా అనేది ఇప్పుడు తేలిపోనుంది.ఇదే వాదన ను గతంలో స్పీకర్ వద్ద రఘురామ వినిపించారు.
ఇప్పుడు మరోసారి ఇదే వాదనను వినిపించేందుకు రఘురామ సిద్ధం అవుతున్నారు.