యాదాద్రి భువనగిరి జిల్లా: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పార్లమెంటు సభ్యుడు ప్రతి సంవత్సరం ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని అందుకు గాను ఈ సంవత్సరం యాదాద్రి జిల్లా భువనగిరి మండలం వడపర్తి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.మంగళవారం వడపర్తి గ్రామాన్ని సందర్శించిన ఎంపీ జిల్లా కలెక్టర్ తో కలసి గ్రామసభలో పాల్గొని గ్రామంలో గల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దివంగత మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి స్వగ్రామమైన వడపర్తి గ్రామాన్ని అనేక సమస్యలు వెంటాడుతున్నాయని, గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో గ్రామస్తులు బోరు బావుల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒకట్టి కూడా కొత్త రేషన్ కార్డు మంజూరు చేయలేదని, పిల్లలు పెద్దవారై కొత్తగా పెళ్లి చేసుకున్న వారు రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వరి వేయొద్దని చెప్పకున్నా వరి వేస్తే ఉరి అంటూ రాష్ట్ర ప్రభుత్వం వరి వేయొద్దని చెప్పడం వల్ల 20 నుంచి 30 శాతం రైతులు మాత్రమే వరి వేశారని మిగతా భూములు పడావుబడ్డాయని , ఈ రైతుల గోసలు రాష్ట్రప్రభుత్వానికి పట్టవా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.