ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.పి ఆర్ సి, హెచ్ ఆర్ ఏ విషయంలో ఏపీ ప్రభుత్వం తో వారు విభేదిస్తున్నారు.
తమ డిమాండ్లకు ప్రభుత్వం తలోగ్గకపోతే సమ్మె బాట పడతామని, ప్రభుత్వాన్ని స్థంభింప చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ఈ విషయంలో ఉద్యోగ సంఘాలన్నీ ఏకమయి ప్రత్యక్ష కార్యాచరణ లోకి దిగిపోయాయి.
మూకుమ్మడిగా అన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కరోనా ఇబ్బందుల నుంచి ఇప్పుడిప్పుడే ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా, ఉద్యోగ సంఘాలు ఈ విధంగా ఆందోళన బాట పట్టడం సరైనది కాదు అనే చర్చ జనాల్లో మొదలవడంతో పాటు, సోషల్ మీడియాలో ప్రభుత్వ ఉద్యోగుల తీరుకి వ్యతిరేకంగా స్పందిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
ప్రభుత్వ ఉద్యోగులు చేపడుతున్న సమ్మె పై జనాల్లో సానుభూతి ఏమాత్రం కనిపించకపోయినా , వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది.
ప్రస్తుతం ఉపాధ్యాయులు ,ఉద్యోగ సంఘాలు చేపట్టిన ఆందోళన పై స్పందిస్తున్న వ్యవహారం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
ఉద్యోగ సంఘాలు చేపట్టిన ఆందోళనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడానికి కుదరదని, కఠినంగా వారి ఉద్యమాన్ని అణిచివేయాలని, పార్టీలకు అతీతంగా జనాలు స్పందిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.నిజంగానే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందా అనే విషయం కొత్తగా చర్చనీయాంశం అవుతోంది.
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న జీతం లో ఒక వంతు ఇచ్చినా పనిచేసేందుకు ఎంతో మంది నిరుద్యోగులు రెఢీ గా ఉన్నారంటూ నిరుద్యోగులను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం కొందరు చేస్తున్నారు.
ఉద్యోగ సంఘాలు మొన్న చేపట్టిన ఆందోళన పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.కొంతమంది ఉద్యోగులు ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగన్ చావు కోరుకుంటూ ఓ మహిళా ఉద్యోగి మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.
ఇక మరికొంతమంది ఉద్యోగులు జగన్ ప్రభుత్వాన్ని మరింత రెచ్చగొట్టే విధంగా పాడిన పాటలు మరింతగా ఉద్యోగుల పై వ్యతిరేకతను పెంచినట్లు గానే కనిపిస్తోంది.