కృష్ణాజిల్లా జగ్గయ్యపేట: పెనుగంచిప్రోలులో సందడి చేస్తున్న “అఖండ” ఎడ్లు. ఎడ్లను చూసేందుకు భారీగా తరలివస్తున్న జనం.
పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి రంగుల ఉత్సవం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది.ఉత్సవంలో భాగంగా తిరుపతమ్మతో పాటు ఆలయంలోని పరివార దేవతామూర్తుల విగ్రహాలను ఎడ్ల బండ్లపై ఉంచి జగ్గయ్యపేటకు వేడుకగా తీసుకుపోతారు.
ఈ నేపథ్యంలో 11 విగ్రహాలను 11 బండ్ల పైనుంచి జగ్గయ్యపేట కు తరలిస్తారు.అందుకు ఎడ్ల బండ్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు.మొదటి బండిగా తిరుపతమ్మ విగ్రహం ఉంచిన బండి ముందుకు సాగుతోంది.ఆ బండి వెనుక మిగతా 10 బండ్లు ఉంటాయి.
లాటరీలో మొదటి బండిని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతల సీతారామయ్య కైవసం చేసుకున్నారు.ఆ బండికి అఖండ సినిమాతో విశేష ప్రాచుర్యం పొందిన ఎడ్లను కట్టాలని నిర్ణయించుకొని ఎడ్ల యజమానిని ఒప్పించారు.
గురువారం గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామం నుంచి పెనుగంచిప్రోలు కు ఎడ్ల జతను తీసుకువచ్చారు.ఈరోజు రాత్రి 8 గంటలకు అమ్మవారి విగ్రహం ఉన్న బండికి వీటిని కట్టనున్నారు.అఖండ సినిమాతో విశేష ప్రాచుర్యం పొందిన ఎడ్లను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల జనం భారీగా తరలి వచ్చారు.దూరంగా ఉండి ఎడ్లతో సెల్ఫీ దిగుతూ సందడి చేశారు.