దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ భారీ ఎత్తున కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే 90% ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ అయ్యింది.
అయితే కరోనాని సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రతి ప్రాంతంలో 100 శాతం వ్యాక్సినేషన్ తప్పనిసరి.అందుకే ప్రస్తుతం వైద్యాధికారులు టీకా ఇంకా తీసుకోని వ్యక్తులను వెతికి మరీ పట్టుకుంటున్నారు.
టీకా తీసుకోవాల్సిందిగా బుజ్జగిస్తున్నారు.కానీ టీకాలు తీసుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదనే అపోహల వల్ల కొందరు వ్యాక్సిన్ వేయించుకునేందుకు తీవ్ర విముఖత చూపుతున్నారు.
తాజాగా ఆ కోవకు చెందిన ఒక వ్యక్తి వింతగా ప్రవర్తించి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు.ఉత్తరప్రదేశ్కు చెందిన సదరు వ్యక్తి వ్యాక్సిన్ వేయించుకునేందుకు ససేమిరా అంటూ వైద్యాధికారుల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు.
ఈ వ్యక్తి చెట్టు పైనుంచి దిగేందుకు నిరాకరించాడు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఇది చూసిన చాలా మంది నవ్వుకుంటున్నారు.
తాజాగా ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని టీకా తీసుకోవాల్సిందిగా ఆరోగ్య కార్యకర్తలు కోరారు.
కోవిడ్ -19 వ్యాక్సిన్ వేసుకుంటే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ ప్రాణాపాయం తప్పుతుందని నచ్చజెప్పడానికి ప్రయత్నించారు.దాంతో బెంబేలెత్తిపోయిన సదరు వ్యక్తి చెట్టుపైకి ఎక్కాడు.
దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన వైద్య అధికారులు ఏం చేయాలో తెలియక అలాగే ఉండిపోయారు.తర్వాత తేరుకొని చెట్టుదిగాలంటూ చాలాసేపు కోరారు.
కొంతసేపటి తర్వాత ఎలాగోలా అతన్ని ఒప్పించి వ్యాక్సిన్ వేయించారు.
“వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇష్టపడనందున ఒక వ్యక్తి చెట్టు ఎక్కాడు.కానీ అతను మా బృందం ఒప్పించిన తర్వాత టీకా తీసుకోవడానికి అంగీకరించాడు” అని రియోటి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అతుల్ దూబే చెప్పారు.ఈ ఫన్నీ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.అందరూ దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.టీకా పట్ల జనాల్లో ఇంత భయం ఉందా? అని కొందరు నోరెళ్లబెడుతున్నారు.