మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ డ్రగ్స్ ఫెడ్లర్ టోనీని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ గురువారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
టోనీని టాస్క్ ఫోర్స్ పోలీసులు ముంబాయిలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తీసుకొచ్చినట్లు తెలిపారు.నైజిరియాకు చెందిన టోనీ ముంబయ్ కేంద్రంగా ఏజెంట్స్ ద్వారా దేశ వ్యాప్తంగా డ్రగ్స్, కొకైన్ రవాణా చేస్తుంటాడని పేర్కొన్నారు.
బెంగుళూరు, ముంబైలలో డ్రగ్స్ సరఫరాకు ప్రత్యేక ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని సీవీ ఆనంద్ తెలిపారు.
హైదరాబాద్లో పలువురు ప్రముఖులకు టోనీ గ్యాంగ్ డ్రగ్స్ సరాఫరా చేసింది.
ముంబైలో టోనీతోపాటు తొమ్మిది మంది డ్రగ్స్ వినియోగదారులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తాత్కాలికమైన వీసా, పాస్పోర్టు తో టోని ఇండియాకు వచ్చి డ్రగ్స్ దందా నడుపుతున్నాడని పేర్కొన్నారు.టోనీ వీసా, పాస్పోర్ట్ గడువు తీరిన తర్వాత కూడా రహస్యంగా ముంబైలో తలదాచుకొంటున్నట్టుగా తెలిపారు.2013లో నైజీరియా నుండి టోని ఇండియాకు వచ్చాడని, ముంబైలోని ఈస్ట్ అంథేరిలో నివసిస్తున్నాడని ఆనంద్ వివరించారు.
కాగా ఇప్పటి వరకు డ్రగ్స్ సరఫరాదారులపైనే దృష్టి పెట్టామని ఇక నుంచి మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నామని సీపీ ఆనంద్ వెల్లడించారు. తొమ్మిది మంది అదే పనిగా డ్రగ్స్ వాడుతున్న వ్యక్తుల గుర్తించి, సెక్షన్ 27 కింద రిమాండ్కు తరలించనున్నట్లు పేర్కొన్నారు.
న్యాయనిపుణుల సలహా మేరకే డ్రగ్స్ వినియోగదారులను అరెస్ట్ చేశామని, హైదరాబాద్ లో డ్రగ్స్ కట్టడి కోసమే ఈ అరెస్ట్లని సీపీ స్పష్టం చేశారు.
అయితే టోనికి ముఖ్య అనుచరుడు ఇమ్రాన్ బాబు షైక్ గతంలోనే పోలీసులు అరెస్టు చేశారు.
ఇమ్రాన్ ముంబైలో ఉండి హైదరాబాద్లో డ్రగ్స్ అమ్మడానికి నూర్ అనే వ్యక్తితో రవాణా చేశాడు. టోని ఆదేశాలతో ఇమ్రాన్ 100 గ్రాముల డ్రగ్స్ తీసుకొని నూర్తో పంజాగుట్టలోని ఓయో హోటల్స్లో దిగి తమ వినియోగదారులకు ఒక్కో గ్రాము రూ.10 వేలకు విక్రయించాలని ప్లాన్ చేశారు.అయితే ఈ ఇద్దరిని నార్త్జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో జీవీకే మాల్ వద్ద పట్టుకొని వారి నుంచి 83 గ్రాములు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.