తెలంగాణలో బీజేపీ మంచి ఊపు మీద ఉంది.టిఆర్ఎస్ ను ఢీకొట్టే స్థాయిలో ఆ పార్టీ బలం పెంచుకుని వరుసగా విజయాలు నమోదు చేసుకోవడం బీజేపీలో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది.
ఆ పార్టీని ఎదుర్కొనేందుకు టిఆర్ఎస్ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ నుంచి ఎటువంటి ముప్పు లేదని , బిజెపి ని కట్టడి చేస్తే సరిపోతుంది అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహారాలు చేస్తున్నారు.
ఇటీవలే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు చోటుచేసుకున్న దగ్గర నుంచి ఆ పార్టీలో మరింత పట్టుదల పెరిగింది.రాష్ట్ర నాయకులు నుంచి బీజేపీ జాతీయ పెద్దల వరకు అంత తెలంగాణపై ఫోకస్ పెట్టారు.
కొంచెం కష్టపడితే అధికారంలోకి వస్తామనే ధీమా ను ప్రదర్శిస్తున్నారు.ఇంత వరకు బాగానే ఉన్నా, తెలంగాణ బీజేపీ లో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి .ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు వ్యతిరేకంగా కొంతమంది నాయకులు ఏకం అవుతున్నారట.
సంజయ్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కొంతమంది సీనియర్ నాయకులు వ్యవహరించడమే కాకుండా, రహస్యంగా ఓ సమావేశాన్ని నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ సీక్రెట్ మీటింగ్ వ్యవహారం బండి సంజయ్ వరకు వెళ్లడంతో, ఆయన మరింత ఆగ్రహం గా ఉన్నారట.అంతేకాదు ఈ వ్యవహారంపై బీజేపీ అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై పార్టీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి ని రంగంలోకి దింపారు.దీంతో ఈ వ్యవహారం సద్దుమణుగుతుంది అని అంతా భావించినా, సీనియర్ నేతలు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మరి తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూ ఉండడంతో పాటు , తమకు షోకాజు నోటీసు ఇస్తే దానికి తగిన సమాధానం ఇస్తాము అంటూ పరోక్షంగా బండి సంజయ్ ను కవ్వించే ప్రయత్నం చేస్తున్నారట.
అంతేకాదు త్వరలో మరో సీక్రెట్ మీటింగ్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.ముఖ్యంగా ఈ గ్రూపు రాజకీయాలు కరీంనగర్ కేంద్రంగా మొదలయ్యాయట.కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా విద్యాసాగర్ రావు ఉన్నప్పటి నుంచే ఈ వర్గ పోరు తీవ్రంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.ముఖ్యంగా విద్యాసాగర్ రావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి మధ్య వివాదం తీవ్రస్థాయిలో ఉండడం, ఇది చాలా కాలం పాటు కొనసాగడం వంటివి జరిగాయి.ఎన్నికల సమయంలో బండి సంజయ్, రామకృష్ణారెడ్డి రెండు గ్రూపులుగా విడిపోయారు.2014 – 18 ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి బండి సంజయ్ ఓటమి చెందారు .దీనికి రామకృష్ణా రెడ్డి వర్గం కారణం అనేది బండి సంజయ్ అభిప్రాయం.2019 ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా గెలవడం, పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం వంటి వ్యవహారాలు జరిగాయి.అప్పటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య వార్ అలాగే కొనసాగుతూ వచ్చింది.ఇప్పుడు మరింత ముదిరి సీక్రెట్ మీటింగ్ వరకు ఆ వ్యవహారం వెళ్ళింది.