యూఎస్- కెనడా బోర్డర్ను ట్రక్కు డ్రైవర్లు దాటాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి అన్న నిబంధనను కెనడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది.అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెనడా బోర్డర్ ఏజెన్సీ పేర్కొంది.
ట్రక్కర్లకు వ్యాక్సిన్ తప్పనిసరి అన్న నిబంధనను తొలగించాలని ప్రధాన ప్రతిపక్షంతో పాటు ట్రకింగ్ లాబీ నుంచి ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు.దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ఆదేశాలు శనివారం అమల్లోకి వస్తాయని తెలిపింది.
డ్రైవర్ల కొరత, వాణిజ్యానికి అంతరాయం, ద్రవ్యోల్బణంపై తమ నిబంధన ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
కొత్త ఆదేశాల ప్రకారం.టీకాలు వేయించుకోని, పాక్షికంగా వ్యాక్సిన్ తీసుకున్న కెనడా ట్రక్ డ్రైవర్లకు యూఎస్- కెనడా సరిహద్దులకు చేరుకున్న సమయంలో పరీక్షలు, క్వారంటైన్ తలనొప్పులు వుండవు.
అయితే ప్రస్తుతం అమెరికా నుంచి వచ్చే ట్రక్కు డ్రైవర్లు టీకాలు తీసుకోనట్లయితే.వారిని జనవరి 15 నుంచి సరిహద్దు వద్దే అడ్డుకుని వెనక్కి పంపిస్తామని కెనడా బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది.
జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ ప్రభుత్వం కోవిడ్పై పోరాటంలో భాగంగా అమెరికా నుంచి వచ్చే ట్రక్ డ్రైవర్లు తప్పనిసరిగా వ్యాక్సిన్ సర్టిఫికేట్ను చూపించాలని.ఇందుకు శనివారం వరకు గడువు విధించింది.కెనడా- అమెరికాల మధ్య 650 కెనడా డాలర్ల విలువైన వాణిజ్యం జరుగుతుందని అంచనా.ఇందులో మూడింట రెండొంతులకు పైగా రోడ్డు మార్గం గుండానే జరుగుతుంది.అందుచేత ఇరుదేశాలకు ట్రక్కింగ్ పరిశ్రమ కీలకమైనది.
ది కెనడియన్ ట్రక్కింగ్ అలయన్స్ (సీటీఏ) అంచనాల ప్రకారం… ప్రభుత్వ నిర్ణయం వల్ల 16000 క్రాస్ బోర్డర్ డ్రైవర్లలో పది శాతం మందిపై ప్రభావం పడుతుందని తెలిపింది. కోవిడ్ మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పుడు దాదాపు 20 నెలలపాటు సరిహద్దును మూసి వేసినప్పుడు కూడా ట్రక్కులు స్వేచ్ఛగా సరిహద్దులను దాటాయి.డ్రైవర్ల కొరత కారణంగా కోవిడ్ సమయంలో కాలిఫోర్నియా, అరిజోనా నుంచి కెనడాకు పండ్లు, కూరగాయాలను తీసుకొచ్చేందుకు అయ్యే ఖర్చు రెండింతలు పెరిగినట్లు అంటారియోలోని ఫ్రూట్స్ ఎగుమతిదారు ఒకరు రాయిటర్స్కు తెలిపారు.