కరోనా మూలంగా చాలా కాలం మూత పడ్డ సినిమా థియేటర్లు కొద్ది రోజుల క్రితమే మళ్లీ తెరుచుకుంటున్నాయి.50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నెమ్మదిగా ఓపెన్ కావడంతో పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి.వాటిలో పలు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.వాటిలో ప్రధానంగా క్రాక్, ఉప్పెన లాంటి సినిమాలు కనీ వినీ ఎరుగని రీతిలో హిట్ కొట్టాయి.అంతేకాదు సగం సీటింగే ఉన్నా మంచి వసూళ్లను సాధించాయి.కరోనా అనంతరం మళ్లీ సినిమా పరిశ్రమకు కొత్త ఊపును తీసుకొచ్చాయి.
కరోనా నెమ్మదించిన వేళ విడుదలైన క్రాక్ సినిమా రవితేజ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.సినిమా పరిశ్రమకు మళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చింది.
అటు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఉప్పెన సినిమాకు వసూళ్ల ఉప్పెన వచ్చింది.ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలను షాక్ కు గురి చేసింది.
ఈ సినిమాలు సగం సీటింగ్ తోనే మంచి వసూళ్లు సాధించడంతో భారీ సినిమాల నిర్మాణం మళ్లీ మొదలయ్యింది.పరిస్థితులు పాజిటివ్ గా మారడంతో పెద్ద నిర్మాణ సంస్థలు భారీ బడ్జెట్ తో పలు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ లైన్ లో పెట్టాయి.
ఇప్పటికే చాలా సినిమాలు సెట్స్ మీదికి వచ్చాయి కూడా.కొంత వరకు షూటింగ్ లు కూడా పూర్తి చేసుకున్నాయి.అయితే ఏపీలో సర్కారు నిర్ణయంతో పాటు కరోనా మళ్లీ పెరగడంతో అగ్ర నిర్మాణ సంస్థలు అప్పుల్లో చిక్కుకునే పరిస్థితి నెలకొంది.
భారీ బడ్జెట్ తో సినిమాలు మొదలు పెట్టిన ఆయా సంస్థలు సినిమాలను మధ్యలో వదిలేయలేక, భారీగా పెరుగుతున్న వడ్డీ రేట్ల ను భరించలేక అవస్థలు పడుతున్నాయి.అంతేకాదు.ప్రస్తుతం డబ్బులు సమకూర్చేందుకు కూడా ఫైనాన్షియర్లు ముందుకు రాకపోవడంతో కష్టాలు చుట్టు ముడుతున్నాయి.
అంతేకాదు.అగ్ర నిర్మాణ సంస్థల ఇబ్బందులను ఆసరాగా చేసుకుని 10 శాతం వడ్డీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట.
ప్రస్తుతం పలువురు నిర్మాతలు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటన్నారట.