అత్యంత రసవత్తరంగా సాగే ఐపీఎల్ తదుపరి సీజన్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రియులు ఎదురు చూస్తున్నారు.బీసీసీఐ ఐపీఎల్ 2022 సీజన్ వీలైనంత త్వరగా నిర్వహించాలని చకచకా పనులన్నీ పూర్తి చేస్తోంది.
అయితే ఒమిక్రాన్ నేపథ్యంలో ఐపీఎల్ మెగా వేలం ఇంకొద్ది రోజులు వాయిదా పడే అవకాశం ఉందని మొన్నటివరకు వార్తలు వచ్చాయి.దీంతో అభిమానులు నిరాశ పడ్డారు.
ఈ క్రమంలోనే ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ తీపి కబురు అందించారు.ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఖరారు అయిందని ఆయన ప్రకటించారు.
ఫిబ్రవరి నెలలో 12, 13 తేదీల్లో బెంగళూరులో మెగా వేలం నిర్వహిస్తామని బ్రిజేష్ పటేల్ తాజాగా ప్రకటించారు.దీంతో క్రికెట్ అభిమానులు ఖుషి అవుతున్నారు.
జనవరి 31తో కొత్తగా చేరిన లక్నో, అహ్మదాబాద్ జట్లు ముగ్గురు ప్లేయర్లను ఎంచుకోవడం పూర్తవుతుంది.ఇప్పటికే కేఎల్ రాహుల్ ను లక్నో జట్టు, హార్దిక్ పాండ్యను అహ్మదాబాద్ జట్టు కెప్టెన్లుగా ఎంచుకున్నాయని సమాచారం.
ఈ రెండు జట్లు నేరుగా ప్లేయర్లను ఎంపిక చేసుకున్న తర్వాత ఫిబ్రవరి నెలలో మెగా వేలం ప్రారంభమవుతుంది.ఈ రెండు రోజుల ఈవెంట్ లో ఆయా జట్లు స్టార్ ప్లేయర్ లను కొనుగోలు చేస్తాయి.
మెగా వేలం కార్యక్రమం పూర్తి కాగానే కరోనా పరిస్థితులను పరిగణలోకి తీసుకొని టోర్నీ నిర్వహించే అవకాశం ఉంది.ఇంతకు ముందులా కాకుండా భారతదేశంలోనే ఐపీఎల్ 15వ సీజన్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంటోంది.టోటల్ సీజన్ ముంబై వేదికగా నిర్వహించాలని ఇప్పటికే బీసీసీఐ ఓ ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది.ఒకవేళ పరిస్థితులు పూర్తి విరుద్ధంగా మారినా వెంటనే వేరే దేశాల్లో ఐపీఎల్ నిర్వహించేందుకు ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ కూడా బీసీసీఐ ఉంచుకుందని తెలుస్తోంది.కొత్త జట్ల రాకతో పాటు ఈసారి చాలామంది జట్లను మారుతున్నారు.
దీంతో ఐపీఎల్ 2022 మరింత ఉత్తేజ భరితంగా ఉండే అవకాశం ఉందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.