ఇప్పటికే ఏపీ సీఎం జగన్ ఎన్నో రకాల ఒత్తిళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సొంత పార్టీలో గ్రూపు రాజకీయాలతో పాటు, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం , రాబోయే ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావడం, ఇలా రకరకాల సమస్యలతో సతమతం అవుతున్నారు.
దీనికితోడు ఏపీలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుకు భారీ ఎత్తున నిధులను ఏర్పాటు చేసుకోవడం, జగన్ కు తలకుమించిన భారంగా మారింది.ఈ సమస్యలన్నీ ఇలా ఉండగానే గత కొద్ది రోజులుగా పిఆర్సి పై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి.
గత నెల రోజులుగా ఇదే విషయం పై ఏపీ ప్రభుత్వం సరైన క్లారిటీ ఇవ్వకపోవడం, ఇప్పటికే అనేకసార్లు చర్చలకు పిలవడం, అక్కడ ఏ క్లారిటీ రాకపోవడం తదితర అంశాలు చూస్తుంటే పిఆర్సి పై ప్రభుత్వం నుంచి సరైన క్లారిటీ వచ్చే అవకాశమే లేదని ఉద్యోగ సంఘాలు ఒక అభిప్రాయానికి వచ్చేశాయి. దీంతో ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు దశలవారీగా ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
కొద్ది రోజుల క్రితం దశలవారీగా ఆందోళన చేపట్టినా.చీఫ్ సెక్రటరీ తో చర్చల సందర్భంగా దానిని విరమింపజేశారు.
స్వయంగా ఏపీ సీఎం జగన్ తో నూ చర్చలు ఉంటాయని , సీఎంతో సమావేశానికి నల్లబ్యాడ్జీలు ధరించి వెళితే బాగోదని చీఫ్ సెక్రటరీ సూచించడంతో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు విరామం ప్రకటించారు.కానీ పిఆర్సి విషయంలో ఉద్యోగ సంఘాలు విధించిన 70 డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని ఉద్యోగ సంఘాలు కూడా సీరియస్ గా తీసుకుంటున్నాయి.
ఈ మేరకు ఈ నెల తొమ్మిదో తేదీ తర్వాత ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
ఈ మేరకు ఉద్యోగ సంఘాల ఐక్య జేఏసీ దీనిపై నిర్ణయం తీసుకుంది.జిల్లాలలో ఆందోళనలు చేపట్టి తర్వాత విజయవాడలో భారీ ఎత్తున నిరసన తెలిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.అలాగే ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయాలని ఉద్యోగ సంఘాలు డిసైడ్ కావడంతో ఈ వ్యవహారం ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.