2024 ఎన్నికలనే టార్గెట్ గా చేసుకుని ఏపీ సీఎం జగన్ వివిధ పథకాలకు రూపకల్పన చేయడంతో పాటు, ప్రస్తుతం అమలవుతున్న ఎన్నో పథకాలలో మార్పుచేర్పులు తీసుకువస్తున్నారు.ముఖ్యంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్న అంశాలపై దృష్టిపెట్టి, ప్రజాయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు.
ఇప్పటికే ఎన్నో విషయాల్లో ఈ విధమైన మార్పులు చేర్పులు జరిగాయి.ఇప్పటికే ఎన్నో వర్గాలు వైసీపీకి దూరమవ్వగా, ప్రజల్లోనూ ఆ వ్యతిరేకత కనిపిస్తోంది.
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజల్లో సంతృప్తి కనిపిస్తున్న, అభివృద్ధి, సమస్యల విషయంలో అసంతృప్తి బాగా ఎక్కువ కనిపిస్తోంది.దీనికి తగ్గట్లుగానే కొన్ని చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రజా గ్రహం తీవ్రంగా ఎదుర్కోవడం , ప్రజలకు వారు అందుబాటులో లేకపోవడం, ప్రజాసమస్యలు చెప్పేందుకు ప్రయత్నించినా ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడం, నియోజకవర్గంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే చోటుచేసుకోవడం, కొంత మంది ఎమ్మెల్యేల వ్యక్తిగత వ్యవహారాలు పార్టీకి డ్యామేజ్ తీసుకురావడం, ఇలా ఎన్నో అంశాలపై జగన్ కు నివేదికలు అందాయి.
దాదాపు నలభై నుంచి యాభై నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా గ్రూపు రాజకీయాల కారణంగా పార్టీకి చెడ్డపేరు రావడంతో పాటు, రాబోయే ఎన్నికల్లోనూ ఈ వ్యవహారాలు తలనొప్పి తెస్తాయి అనే ఆందోళన చెందుతున్నారు.అందుకే నియోజకవర్గాల్లో పరిస్థితి ఏవిధంగా ఉందనేది ఇప్పటికే ఇంటలిజెన్స్ రిపోర్ట్ లతోపాటు, ప్రైవేట్ సర్వేల ద్వారా తెలుసుకున్నారు.
తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తున్న వారితో పాటు , 2024 ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదనుకున్న ఎమ్మెల్యేలకు 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని జగన్ డిసైడ్ అయ్యారట.
ముఖ్యంగా కొన్ని రిజర్వ్డ్ స్థానాల్లో ఎమ్మెల్యేల తీరుపై బహిరంగంగానే ప్రజావ్యతిరేకత కనిపిస్తుండటం, మీడియాలోనూ సదరు వార్తలు హల్చల్ చేస్తుండడంతో వారిని మార్చకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటామనే అభిప్రాయంలో జగన్ ఉన్నారట.దీంతో రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలామందికి నిరాశ తప్పేలా కనిపించడం లేదు.