చంద్రబాబు మారిపోయారు.అవును బాబు గారు బాగా మారిపోయారు.
ఎప్పుడూ లేనంతగా మారిపోయారు.కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ, ఏ ఒక్కరిని ఉపేక్షించనంతగా మారిపోయారు అంటూ తెలుగుతమ్ముళ్లు ఒకటే గుసగుసలు ఆడుకుంటున్నారు.
చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే ఇదే విధంగా ఉంది.ఆయన ఎప్పుడు లేనంత స్థాయిలో పార్టీ నాయకులపై ఆగ్రహానికి గురవుతున్నారు.
తప్పు జరిగిందని తేలిన వెంటనే పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వేసేస్తున్నారు.గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు అనేక సార్లు వార్నింగ్ ఇస్తూ భయపెట్టి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేసేవారు, లేకపోతే పని చేయని వారికి ప్రాధాన్యం బాగా తగ్గించి సమర్థులకు పెద్ద పీఠ వేసేవారు.
అయితే ఇప్పుడు మాత్రం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే సస్పెన్షన్ వేటు వేస్తూ నాయకులకు కొత్త సంకేతాలు ఇస్తున్నారు.గత వారం రోజులుగా చూసుకుంటే పార్టీ ముఖ్య నాయకుల పై సస్పెన్షన్ వేటు వేయడం కలకలం రేపుతోంది.
ముఖ్యంగా ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ చాలా చోట్ల దారుణంగా ఓటమి చెందింది.దీనికి సొంత పార్టీ నాయకుల వ్యవహారమే అనే విషయాన్ని సీరియస్ గా బాబు తీసుకున్నారు.
ముఖ్యంగా నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించారని తేలడంతో , నెల్లూరు జిల్లాలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి వేలూరు రంగారావు, మాజీ గ్రంధాలయ చైర్మన్ వెంకట స్వామి నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
వీరు సోషల్ మీడియాలో సొంత పార్టీ నాయకుల పైన అనుచితంగా విమర్శలు చేస్తున్నారని ఫిర్యాదులు బాబుకు అందడంతోనే వీరిపై వేటు వేశారు.వీరే కాదు ఇకపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి ఇదే బహుమతి అనే విధంగా బాబు హెచ్చరికలు జారీ చేశారు.గతంలో మాదిరిగా కాకుండా , బాబు ఇప్పుడు సస్పెన్షన్లు చేస్తూ పార్టీ విషయంలో వ్యతిరేక భావంతో ఉండే వారికి గట్టి సంకేతాలు పంపిస్తున్నారు.
దీంతో తెలుగు తమ్ముళ్ల లో ఒకటే టెన్షన్ మొదలైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకుల నివేదికలు , పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేవారి కి సంబంధించిన సాక్ష్యాధారాలు అన్ని పక్కాగా ఉండడంతో ఏ క్షణంలో ఎవరిపై వేటు పడుతుందో అనే టెన్షన్ సదరు నాయకుల్లో నేలకొందట.