అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసి ఏడాది కావొస్తోంది.కొత్త అధ్యక్షుడు బైడెన్ ఇప్పుడిప్పుడే ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు సాధిస్తున్నారు.
ఇంకా మూడేళ్ల సమయం వున్నప్పటికీ అప్పుడే 2024 ఎన్నికలపై దృష్టి పెట్టాయి అమెరికన్ పార్టీలు.ఇప్పటికే జో బైడెన్ మరోసారి తాను ఎన్నికల బరిలో నిలుస్తానని చెప్పగా… రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సై అన్నారు.
బైడెన్, ట్రంప్ల పార్టీల్లోని మరికొందరు కూడా రేసులో వున్నారు.వీరిందరికంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.
ప్రస్తుతానికి అధికార పార్టీ నుంచి ఆమె పేరొక్కటే వినిపిస్తుండగా.రాబోయే రోజుల్లో మరికొందరు కూడా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం కమలా హారిస్ రాజకీయంగా గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు.అయితే జో బైడెన్తో 2024 ఎన్నికల గురించి కానీ రెండోసారి అధ్యక్ష బరిలో నిలుస్తారా అన్న దానిపై చర్చించలేదని కమలా హారిస్ తేల్చిచెప్పారు.
బైడెన్ మళ్లీ ఎన్నికల బరిలో నిలబడకూడదని నిర్ణయించుకుంటే .ఆమె మళ్లీ వైట్హౌస్ పోటీలో వుండరని విశ్లేషకులు అంటున్నారు.ఈ కథనాలపై కమలా హారిస్ స్పందిస్తూ.తాము ఇంకా ఏడాది పాలన పూర్తి చేసుకోలేదు.అంతేకాకుండా కోవిడ్ మహమ్మారితో బాధపడుతున్నాం.ఇలాంటి పరిస్ధితుల్లో ఎన్నికల గురించి మాట్లాడలేనని వాల్స్ట్రీట్ జర్నల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
అయినప్పటికీ బైడెన్ మరోసారి పోటీ చేస్తారా అని విలేకరి గుచ్చిగుచ్చి అడగ్గా.దాని గురించి తాను ఆలోచించలేదని, ఇంతవరకు మా ఇద్దరి మధ్యా ఆ ప్రస్తావన రాలేదని కమలా హారిస్ స్పష్టం చేశారు.
అమెరికా ఉపాధ్యాక్ష పదవిని చేపట్టిన తొలి మహిళ, తొలి నల్లజాతి వ్యక్తి, తొలి దక్షిణాసియా వాసిగా కమలా హారీస్ చరిత్ర సృష్టించారు.ఆ సమయంలో ఆమె క్రేజ్ ఆకాశాన్ని తాకింది.కానీ కమలా హారిస్ సిబ్బంది సమన్వయ లోపం, ఆశించిన స్థాయిలో పరిపాలన లేకపోవడంతో పాటు దేశ దక్షిణ సరిహద్దులో వలస సంక్షోభం వంటి అంశాల్లో ఆమె వైఖరిపై ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా దుమ్మెత్తిపోస్తున్నాయి.