వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకురాలిగా ఉన్నారు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రోజా జగన్ కు అత్యంత సన్నిహితురాలిగా మారారు.
అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలోనూ రోజా ముందుండేవారు.ఇక అసెంబ్లీలో లోకేష్, చంద్రబాబు తో పాటు , మిగతా మంత్రులు వ్యవహారాల పైన ఘాటుగా స్పందిస్తూ , పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండేవారు.
రోజా మాటల విమర్శలకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆందోళన చెందుతూ వచ్చేది. అందుకే ఆమెపై దాదాపు సంవత్సరం పాటు అసెంబ్లీల్లో అడుగు పెట్టకుండా సస్పెన్షన్ వేటు కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం వేయించింది అంటే , రోజా ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది.
ఇక 2019 లోనూ వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా రోజా గెలిచారు.ఆమెకు మంత్రి పదవి దక్కుతుందని అభిప్రాయపడినా, జగన్ మాత్రం సామాజిక వర్గాల సమతూకం కారణంగా ఆమెను పక్కన పెట్టారు.
మంత్రి పదవి వస్తుందని ఆమె ఒకవైపు ఆశలు పెట్టుకుంటూనే వస్తుండగా, ఇప్పుడు ఆమెకు నగరి నియోజకవర్గం లోని వైసీపీ నాయకులే శత్రువులు గా మారారు.రాబోయే ఎన్నికల సమయంలో రోజాకు జగన్ టిక్కెట్ ఇవ్వరు అని, తామే అభ్యర్థి అని కొంతమంది ప్రచారం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తుండటం, పార్టీలోనూ పెత్తనం చేస్తూ ఉండడం రోజాకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది.
ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పై పోరాడుతున్న, సొంత పార్టీ నేతల అసమ్మర్తి ఎదుర్కోవడం రోజా కు ఇబ్బందికరంగా మారింది.
ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అమ్ములు వర్గంతో పాటు, కేజే కుమార్ వర్గం తోనూ రోజాకు తలనొప్పులు వచ్చిపడుతున్నాయి.దీంతో ఇంటి పోరు నుంచి బయట పడేందుకు రోజా ఏపీ సీఎం జగన్ , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తన ఇబ్బందులు చెప్పుకుంటున్న ఫలితం దక్కడం లేదట.ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం రోజా విషయంలో అంత సానుకూలంగా లేరనే విషయం ఎప్పటి నుంచో వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే సొంత పార్టీలోని రోజా వ్యతిరేక వర్గం అంతా ఒక తాటిపైకి వచ్చి ఆమెకు వ్యతిరేకంగా వ్యవహారాలు చేస్తుండడం తో దీనిని ఎలా ఎదుర్కోవాలనే విషయంలో ఆమె తర్జన భర్జన పడుతున్నారట.ఈనెల 21వ తేదీన ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టే కార్యక్రమాలపై అసమ్మర్తి వర్గం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిందట.
దీనికి రోజాకు ఆహ్వానం అయితే అందలేదట.ఈ సమావేశాన్ని వైసీపీ నేత కేజే కుమార్, ఈడిగ కార్పొరేషన్ చైర్పర్సన్ కేజే శాంతి , శ్రీశైలం ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, వడమాలపేట జడ్పిటీసీ మురళీధర్ రెడ్డి, పుత్తూరు నుంచి అమ్ములు, విజయ పురం నుంచి పార్టీ మాజీ అధ్యక్షుడు లక్ష్మీపతి రాజు ఈ సమావేశానికి హాజరు కావడం రోజా వర్గానికి మింగుడు పడడం లేదు.
రోజా కారణంగానే నగరి నియోజకవర్గంలో టీడీపీ బలపడుతుందని వైసీపీ బలహీనంగా మారుతోందని వైరి వర్గం నాయకులు బహిరంగంగానే ప్రచారం చేస్తుండడం, 2024 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే టికెట్ రోజా కి మళ్లీ కేటాయిస్తే ఆమె ఓటమి ఖాయం అంటూ వైరి వర్గం నాయకులు శపథం చేస్తున్నారట.