ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాజకీయ వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు .2024 తరువాత తాను రాజకీయాల్లో కొనసాగేదే లేదు అని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పేసారు.గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు తనకు రాజమండ్రి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసైనా, మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినా, తాను బీజేపీ ని నమ్ముకుని ఉన్నాను అని, బీజేపీ కి మాత్రమే ఏపీలో పాలించే అర్హత ఉందని ఒక్క ఛాన్స్ ఇవ్వాలి అంటూ వీర్రాజు ప్రజలను కోరారు .తాను 42 ఏళ్లు గా రాజకీయం చేస్తున్నానని , వచ్చే ఎన్నికల తర్వాత రాజకీయాల్లో ఉండేది లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.
వీర్రాజు ఇంత సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.నిజంగానే ఆయన రాజకీయ వైరాగ్యం లో ఉన్నారా లేక సానుభూతి కోసం ఈ తరహా డైలాగులు వేస్తున్నారా అనేది సందిగ్ధంగానే ఉంది.
వీర్రాజు పై బీజేపీ వర్గాలు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నాయి .వీర్రాజు వ్యూహాత్మక ఎత్తుగడ అని, ఆయన సానుభూతి తో ప్రజల మనసు మార్చాలని చూస్తున్నారనే వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం సోము వీర్రాజు ఎమ్మెల్సీ పదవి టీడీపీ మద్దతుతోనే దక్కింది. ఇప్పుడు ఆ పదవి కూడా పూర్తి కావస్తున్న నేపథ్యంలో మరో పదవి దక్కే అవకాశం లేదు.
దీంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.అది కాకుండా గతంలో ఇచ్చినంత ప్రాధాన్యం ఇప్పుడు పార్టీ హైకమాండ్ ఇవ్వకపోవడం , ఆయనను వైసీపీకి మద్దతుగా వ్యవహరిస్తారనే ఫిర్యాదులు బీజేపీ అధిష్టానానికి వెళ్లడం, ఇలా ఎన్నో అంశాలు ఇటీవల బాగా వీర్రాజు ఇమేజ్ తగ్గించాయి.
ఇక అమరావతి వ్యవహారంలో వీర్రాజు వ్యవహారం వేరేగా ఉండేది.ఇది పూర్తిగా టీడీపీకి సంబంధించిన వ్యవహారంగా చూసేవారు.అయితే ఇప్పుడు బీజేపీ అధిష్టానం అమరావతి ఉద్యమంలో బీజేపీ నేతలంతా పాల్గొనాలని, అమరావతి మహా పాదయాత్రలో పాల్గొనాలని ఆదేశించడం తో తప్పనిసరి పరిస్థితుల్లో వీర్రాజు అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్నారు.అదీ కాకుండా బీజేపీ లోని తన ప్రత్యర్థి వర్గానికి పార్టీ అధిష్టానం ఈ మధ్యకాలంలో బాగా ప్రాధాన్యం ఇవ్వడం వంటి వ్యవహారాలు వీర్రాజు కు ఆగ్రహాన్ని కలిగిస్తున్నట్టు గా కనిపిస్తున్నాయి.
అందుకే ఈ వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.