కరోనా దెబ్బకు తీవ్రంగా ప్రభావితమైన రంగం విమానయానం.ఫస్ట్వేవ్ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుని పలు దేశాలు టూరిస్ట్లకు స్వాగతం పలికాయి.
కానీ సెకండ్ వేవ్ వాటికి బ్రేక్ వేసింది.భారత్తో సహా పలు దేశాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులను దాదాపు అన్ని దేశాలు నిలిపివేశాయి.
అయితే మళ్లీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఒక్కొక్క దేశం ఆంక్షలను ఎత్తివేస్తూ వస్తోంది.డబ్ల్యూహెచ్ఓ ఆమోదం పొందిన వ్యాక్సిన్ను రెండు డోసులు తీసుకున్న వారిని అనుమతిస్తున్నట్లు పలు దేశాలు ప్రకటించాయి.
డిసెంబర్ చివరి నాటికి ప్రపంచం మొత్తం సాధారణ పరిస్ధితులు నెలకొంటాయని అందరూ భావించారు.
కానీ దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ అందరి ఆశలపై నీళ్లు చల్లింది.
అమెరికా, ఆస్ట్రేలియా సహా 20కి పైగా దేశాలు దక్షిణాఫ్రికా నుంచి విమానాల రాకపోకలను నిషేధించాయి.విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కట్టుదిట్టంగా స్క్రీనింగ్ చేస్తున్నాయి.
అంతేకాదు క్వారంటైన్లో ఉండాలని కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చాయి.భారత్ విషయానికి వస్తే.
సెకండ్ వేవ్ నేపథ్యంలో మనదేశం నుంచి వివిధ దేశాలకు విమాన రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.దీంతో ఉద్యోగ, వ్యాపారాల కోసం పలు దేశాలకు వెళ్లాల్సిన భారతీయులు స్వదేశంలోనే నిలిచిపోయారు.
అయితే పరిస్దితులు చక్కబడిన నేపథ్యంలో డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్దరిస్తామని ప్రకటించింది.కానీ ఈలోపు కొత్త వేరియంట్ కారణంగా భారత ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
ఈ పరిణామం భారతీయులపై తీవ్రంగా పడే అవకాశం వుంది.దాదాపు నెలల తర్వాత అన్ని దేశాల్లోనూ ఆంక్షలు ఎత్తివేయడంతో ఉద్యోగాల్లో, కళాశాలల్లో చేరేందుకు మనోళ్లు సిద్ధమవుతున్నారు.ఈ సమయంలోనే ఒమిక్రాన్ విరుచుకుపడుతుండటంతో ఎక్కడ మరోసారి అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తారోనన్న భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది.దీంతో వీలైనంత త్వరగా తమ గమ్యానికి చేరుకోవాలని భావిస్తున్నారు.
ఈ పరిణామాలతో విమాన చార్జీలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి.ఆంక్షలు కఠినతరం కాకముందే ప్రయాణాలు చేయాలనే ఉద్దేశంతో చాలా మంది టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.
అదే సమయంలో క్రిస్మస్ సీజన్ కావడంతో విమాన చార్జీలు పెరగడానికి కారణమైంది.ఒమిక్రాన్ భయం నేపథ్యంలో భారత్ నుంచి విపరీతమైన రద్దీ ఉండే యూఏఈ, అమెరికా, బ్రిటన్, కెనడాలకు విమాన చార్జీలు రెండింతలు అయినట్లు తెలుస్తోంది.
ఏవియేషన్ సంస్థలు కూడా డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి.దీంతో అంతిమంగా ప్రయాణీకులపై భారం పడుతోంది.