అమెరికా… శాస్త్ర, సాంకేతిక, ఆర్ధిక రంగాల్లో అగ్రగామిగా వెలుగొందుతున్న దేశం.అందుకే ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల ఫైనల్ డెస్టినేషన్ అమెరికాయే.
విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం ప్రతి ఏటా అగ్రరాజ్యానికి వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది.ఏదో ఒక రకంగా అమెరికాలో స్థిరపడి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రపంచం భావిస్తోంది.
ఇందులో భారతీయులు సైతం వున్నారు.అక్కడి వలసదారుల్లో అత్యంత శక్తివంతమైన, బలమైన కమ్యూనిటీ ఇండియన్సే.
అందుకే అప్పు చేసైనా సరే తమ పిల్లలను అమెరికా పంపిస్తున్నారు తల్లిదండ్రులు.అక్కడ తమ పిల్లలు సంపాదిస్తుంటే ఇక్కడ గొప్పగా చెప్పుకోవడంతో పాటు ఆస్తుల్ని సంపాదించుకోవచ్చన్నది లక్షలాది మంది భారతీయ పేరెంట్స్ కల.అయితే ఈ కలను నెరవేర్చుకునేందుకు తీవ్రంగా శ్రమించే వారు కొందరైతే.అక్రమ మార్గాల్లో అమెరికాలో అడుగుపెట్టాలని భావించేవారు ఇంకొందరు.
ఈ క్రమంలోనే బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.
తాజాగా అగ్రరాజ్యంలోకి అక్రమంగా ప్రవేశిస్తూ ముగ్గురు భారతీయులు అడ్డంగా దొరికిపోయారు.
వీరిని క్రిష్ణబెన్ పటేల్(25), నికుంజ్ కుమార్ పటేల్(27), అశోక్ కుమార్ పటేల్(39)లుగా గుర్తించారు.వీరిని గత నెల 24న వర్జిన్ ఐస్ల్యాండ్లోని సెయింట్ క్రోయిక్స్ విమానాశ్రయంలో పట్టుకున్నారు.
ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్కు వెళ్లేందుకు వచ్చిన వీరిని తనిఖీల్లో భాగంగా సరైన ధృవపత్రాలు లేకపోవడంతో బోర్డర్ సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేశారు.అనంతరం ఈ గురువారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
అయితే విచారణ సందర్భంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.వీరు ముగ్గురు ఇమ్మిగ్రేషన్ అధికారులకు దొరకడం ఇదే తొలిసారి కాదట.2019లో కాలిఫోర్నియాలోని టెకేట్లో కూడా ఇలాగే అక్రమ మార్గంలో అమెరికాలోకి ప్రవేశించినందుకు అరెస్ట్ అయ్యారు.దాంతో వారిని దేశం నుంచి బహిష్కరించారు.
అయినప్పటికీ బుద్ధి తెచ్చుకోకుండా .ఇప్పుడు మరోసారి నకిలీ ధ్రువపత్రాలతో అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని దర్యాప్తు అధికారులు కోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు.విచారణ దశలో వున్న ఈ కేసులో వీరి నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్ష.దేశ బహిష్కరణ విధించే అవకాశం వుందని న్యాయ నిపుణులు అంటున్నారు.