అటవీ జంతువులు సాధారణంగా ఆహారం కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తుంటాయి.అలా వెళ్లే క్రమంలోనే తమ కుటుంబాన్ని సైతం తీసుకెళ్తుంటాయి.
ఏనుగుల విషయానికి వస్తే తమ ఫ్యామిలీ రక్షణగా ఉంటూ కుటుంబ పెద్ద ముందు ఉండి మార్గం చూపుతుంది.ఏనుగులు ఎప్పుడూ సింగిల్గా జర్నీ చేయవు.
ఆహారం కోసం వలస వెళ్లేటప్పుడు గుంపులు గుంపులుగా వెళ్తుంటాయి.సీజన్ను బట్టి ప్రాంతాలు మారుస్తుంటాయి.
ఇవి వెళ్లే దారిలో ఏ ఆటంకం రాకుండా ఫారెస్టు అధికారులు ఏర్పాట్లు చేస్తుంటారు.వేటగాళ్ల నుంచి వాటిని రక్షించడానికి ప్రత్యేకమైన రక్షణ చర్యలు సైతం చేపడుతుంటారు.
ఈ క్రమంలోనే ఓ ఏనుగుల గుంపు ఆహారం కోసం సంచరిస్తూ బురద నీటిలో చిక్కుకున్నాయి.
అస్సాంలోని గోల్పరా జిల్లా లఖిపూర్ సమీపంలోని చోయిబరీ అటవీ ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఐదు ఏనుగుల గుంపు బురద నీటిలో చిక్కుకున్నట్టు స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.వారు వెంటనే అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో ఆ ఏనుగుల మందను రక్షించారు.
గురువారం రాత్రి ఒక పిల్ల ఏనుగు సహా 5 ఏనుగులు నీరు తాగేందుకు వచ్చి బురద నీటిలో చిక్కుకున్నాయి.ఇవి ఆహారం కోసం మేఘాలయ వైపు నుంచి సమీపంలోని కొండ ప్రాంతం గుండా అస్సాం బోర్డర్లోకి వచ్చాయని తెలిసింది.
బురద చెరువులో చిక్కుకున్న ఏనుగులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా వాటి వల్ల కాకపోవడంతో ఘీంకరించడం మొదలెట్టాయి.దీంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు చెప్పడంతో అటవీ శాఖ, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వాటిని రక్షించారు.‘గున్న ఏనుగు సహా ఐదు అటవీ ఏనుగులను జేసీబీల సాయంతో తాళ్లతో కట్టి బయటకు తీశామన్నారు.ప్రస్తుతం ఐదు ఏనుగులు సురక్షితంగా ఉన్నాయని అటవీశాఖ అధికారి ఒకరు వెల్లడించారు.
ఈ ఆపరేషన్ లో ఏనుగులకు ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు.అనంతరం వాటికి మళ్లీ దారి చూపించడంతో అవి వెళ్లిపోయాయని చెప్పారు.
ఏనుగులు సురక్షితంగా బయటకు రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.