సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకేసారి అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలు ఒకేసారి విడుదల అవుతూ పెద్ద మొత్తంలో పోటీల్లో నిలబడతాయి.కొన్నిసార్లు ఇలా రెండు సినిమాలు బరిలోకి దిగినప్పుడు రెండు కూడా అత్యంత భారీ విజయాన్ని కైవసం చేసుకోగా మరికొన్ని సార్లు ఒక సినిమా విజయాన్ని అందుకొని మరొక సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటాయి.
ఇలా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగాయి.ఈ క్రమంలోనే గతంలో ఎన్టీ రామారావు, కృష్ణ నటించిన సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి.అయితే ఈ సినిమాలు చిత్రీకరణ ప్రారంభం నుంచి విడుదల వరకు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచాయి.
1978 నందమూరి తారకరామారావు హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో డివిఎస్ నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా సింహబలుడు అనే టైటిల్ తో ఓ చిత్రాన్ని ప్రారంభించారు.అయితే కృష్ణ హీరోగా అదేసమయంలో గిరిబాబు నిర్మాతగా కొమ్మినేని దర్శకత్వంలో సింహగర్జన అనే సినిమాను ప్రారంభించారు.అయితే ఈ రెండు సినిమా కథలు పూర్తిగా విభిన్నం అయినప్పటికీ ఈ రెండు సినిమాల మధ్య తీవ్రస్థాయిలో పోటీ ఏర్పడింది.
అప్పటికే అల్లూరి సీతారామరాజు సినిమా విషయంలో ఎన్టీ రామారావు కృష్ణ మధ్య పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకోవడంతో ఇదే అదునుగా భావించిన కొంతమంది ఎన్టీఆర్ సినిమాకు కావాలనే పోటీగా సింహగర్జన సినిమా తీస్తున్నారనే వివాదాన్ని లేపారు.
ఈ విషయం మీడియాలో రావడంతో వెంటనే అలర్ట్ అయిన నిర్మాత గిరిబాబు హుటాహుటిన రామారావు అపాయింట్మెంట్ తీసుకుని అతనిని కలిశారు.తన సినిమాకు పోటీగా సింహ గర్జన తీయలేదని పావుగంటలో సింహ గర్జన సినిమా కథను మొత్తం ఎన్టీ రామారావు గారికి చెప్పడంతో ఆ సినిమా కథ విన్న రామారావు అసలు సింహబలుడు సినిమాకి సింహగర్జన సినిమాకి పోలిక లేదని అభయమిచ్చారు.
దీంతో ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్న గిరిబాబు తిరిగి తన సినిమా పనులను మొదలు పెట్టారు.ఇలా ఎన్టీఆర్ ఈ సినిమా గురించి భరోసా ఇచ్చినప్పటికీ ఈ సినిమాలకు పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నటించిన సింహబలుడు సినిమాను 1978 ఆగస్టు 11వ తేదీన విడుదల చేశారు.
అదే నెలలో 25 వ తేదీన కృష్ణ నటించిన సింహ గర్జన విడుదల అయింది.ఇలా సింహ అన్న పేర్లతో రెండు సినిమాలు పది రోజుల వ్యత్యాసంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ పోటీలో ఎన్టీ రామారావు నటించిన సింహబలుడు ఫ్లాప్ టాక్ తెచ్చుకోగా కృష్ణ నటించిన సింహగర్జన అద్భుతమైన విజయాన్ని సాధించింది.