టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు చేసిన హాట్ కామెంట్స్ తిరిగి తిరిగి నందమూరి వారసుడు ఎన్టీఆర్ కు చుట్టుకున్నాయి.వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో చంద్రబాబు భార్య భువనేశ్వరి పై విమర్శలు చేసినా, ఆయన మేనల్లుడు అయిన ఎన్టీఆర్ సరైన విధంగా స్పందించలేదని, ఘాటు పదజాలంతో వైసిపి నాయకుల పై విమర్శలు చేయలేదని, అసలు భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీఆర్ విఫలం అయ్యారు అని ఎన్నో రకాలుగా టిడిపి నేతలు వర్ల రామయ్య, బుద్ధ వెంకన్న వంటివారు విమర్శలు చేశారు.
ఈ విమర్శలతో టిడిపి వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నట్లుగా వివాదం చెలరేగింది.ఎన్టీఆర్ ఫ్యాన్స్ టిడిపికి మద్దతుగానే ఉంటూ వస్తున్నారు.
ఎప్పుడైతే టిడిపి నేతలు ఎన్టీఆర్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేశారో అప్పటి నుంచి టిడిపి పైన, ఎన్టీఆర్ పై విమర్శలు చేసిన వారి పైన వారు తీవ్ర ఆగ్రహాన్ని అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు.
తాజాగా చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది.
గతంలోనే తెలుగుదేశం పార్టీ బాధ్యతలను ఎన్టీఆర్ తీసుకోవాలని, అప్పుడే పార్టీ కి మళ్ళీ పునర్వైభవం వస్తుందని , నియోజకవర్గంలో భారీ ఫ్లెక్సీలను చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేయడం , చంద్రబాబు సమక్షంలోనే ఎన్.టి.ఆర్ నినాదాలు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించాయి .అప్పట్లో ఈ వ్యవహారంపై బాబు సైలెంట్ అయిపోయారు.అయితే ఇప్పుడు భువనేశ్వరి వ్యవహారంలో ఎన్టీఆర్ టార్గెట్ కావడంతో, కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరింతగా తమ అభిమానాన్ని చాటుతూ, టిడిపి పై ఉన్న అసంతృప్తిని పరోక్షంగా వెళ్లగక్కారు.
నిన్న ఆదివారం కుప్పంలోని ఎన్ ఆర్ ఎం సినిమా హాల్లో జై లవకుశ సినిమా ను స్పెషల్ షో గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేయించుకున్నారు.ఈ సందర్భంగా థియేటర్ వద్ద పెద్ద ఎత్తున డ్యాన్సులు చేయడమే కాకుండా ‘ బాబులకు బబు తారక్ బాబు ‘ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నినాదాలు ఇప్పుడు టిడిపిలో హాట్ టాపిక్ గా మారాయి.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన రచ్చ పై చంద్రబాబు కూడా నివేదిక తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పై తమ పార్టీ నాయకులు చేసిన విమర్శలకు కౌంటర్ గా ఫ్యాన్స్ ఈ తరహా నినాదాలు చేశారా లేక దీని వెనుక మరేవరైనా ఉన్నారా అనే విషయంపై చంద్రబాబు ఆరా తీసే పనిలో ఉన్నారట.
అసలు కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి పరాజయంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కుప్పం నియోజకవర్గం లో చేస్తున్న రచ్చ మరింత తలనొప్పిగా మారింది.