ఏదో రకంగా వైసీపీని ఇరుకున పెట్టి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలవాలనే వ్యూహంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తున్నారు. అందుకే 2024 ఎన్నికలను టార్గెట్ చేసుకుని ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
సెంటిమెంట్ ను భారీగా పండించి ఈ ఎన్నికల్లో విజయం సాధించే విషయంపై దృష్టి పెట్టారు.అలాగే పార్టీలోకి పెద్దఎత్తున చేరికలు ఇప్పటి నుంచి ఉండేలా చూసుకునేందుకు అనేక వ్యూహాలు పన్నుతున్నారు.
ఎన్నికలకు ముందు భారీగా టిడిపిలో చేరికలు ఉండే అవకాశం ఉందని బాబు గుర్తించారు. అయితే ఎన్నికల కంటే ముందుగానే ఈ చేరికలు ఉండేలా చూసుకుంటే ఎన్నికల సమయంలో ఇబ్బందులు ఉండవని, అలాగే టిక్కెట్ల కేటాయింపు విషయంలో తల నొప్పులు వస్తాయి అనేది బాబు అభిప్రాయంగా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో తన భార్య భువనేశ్వరి గురించి అనుచిత వ్యాఖ్యలు పరోక్షంగా వైసీపీ నేతలు చేయడంపై బాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో పార్టీలకు అతీతంగా ప్రజల నుంచి సానుభూతి వ్యక్తమవడంతో, ఇదే సానుభూతిని ఎన్నికల వరకు తీసుకువెళ్లాలి అనేది చంద్రబాబు అభిప్రాయంగా కనిపిస్తోంది.
అందుకే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ‘ఆడపడుచుల ఆత్మగౌరవం ‘ సభలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది.శాసన సభను కౌరవ సభ గా మార్చి మహిళల వ్యక్తిత్వంపై వైసీపీ నేతలు దాడి చేశారని , ఈ సభల ద్వారా తెలుగుదేశం పార్టీ హైలెట్ చేయబోతోంది.
అలాగే చంద్రబాబు సీఎం అయ్యే వరకు అసెంబ్లీలో అడుగు పెట్టను అనే శపదానికి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించింది.
అలాగే వరద మరణాలపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని, తుఫాను ముందస్తు చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని, వరద తీవ్రతకు ఇసుక మాఫియా కారణం అంటూ పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది.అలాగే వరదల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియ ప్రకటించాలని, గాయపడినవారికి లక్ష పరిహారం ఇవ్వాలని పొలిట్ బ్యూరో సమావేశం లో నిర్ణయం తీసుకున్నారు.ఇక ఆడపడుచుల ఆత్మగౌరవం పేరుతో టీడీపీ నిర్వహించబోయే ఈ సభల ద్వారా వైసిపికి మహిళల నుంచి వ్యతిరేకత పెరిగేలా చేసేందుకు చంద్రబాబు ప్లాన్ చేసినట్టుగా అర్థం అవుతోంది.