కరోనా మహమ్మారిని అద్భుతంగా నిలువరించి ప్రపంచ దేశాల మన్ననలు పొందిన న్యూజిలాండ్లో తాజాగా వైరస్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.దాదాపు ఆరు నెలల తర్వాత ఆగష్టులో అక్కడ తొలి కరోనా కేసు నమోదైంది.
ఆక్లాండ్ నగరంలోని ఓ 58 ఏళ్ల వ్యక్తిలో డెల్టా వేరియంట్ ను గుర్తించారు.ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించి సంచలనం సృష్టించారు .న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్.ప్రపంచ దేశాల ప్రశంసలు పొందిన కివీస్ను ఇప్పుడు డెల్టా వేరియంట్ కలవరపెడుతోంది.
కోవిడ్ ఆ దేశంలోకి అడుగుపెట్టిన దగ్గరి నుంచి ఎన్నడూ లేని విధంగా ఆ దేశంలో ఒక్కరోజులోనే భారీగా కేసులు నమోదవుతున్నాయి.
ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ తన సరిహద్దులను తెరవాలని నిర్ణయించుకున్నప్పటికీ తాజా పరిస్ధితితో వెనక్కి తగ్గింది.
దీంతో అక్కడ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు, ఆ దేశ పౌరులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.మార్చి 2020లో కోవిడ్ 19 వెలుగులోకి వచ్చిన నాటి నుంచి కివీస్ కఠినంగా వుంటూ వస్తోంది.
అంతర్జాతీయ ప్రయాణీలకు ఐసోలేషన్తో పాటు ఓఈసీడీ దేశాలపైనా పరిమితులను అమలు చేసింది.దీని కారణంగానే న్యూజిలాండ్ ఆర్ధిక వ్యవస్థ వేగంగా పుంజుకుంది.అయితే ఊహించని విధంగా అక్లాండ్లో డెల్టా వేరియంట్ వెలుగులోకి రావడంతో కివీస్ ఉలిక్కిపడింది.దీంతో మళ్లీ ఆ దేశం నిబంధనల చట్రంలోకి వెళ్లిపోయింది.
అయినప్పటికీ మొక్కవోని దీక్షతో భారీగా వ్యాక్సినేషన్ను అమలుచేసి పరిస్ధితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే పూర్తిగా టీకాలు తీసుకున్న అంతర్జాతీయ ప్రయాణీకులు ఏప్రిల్ 30, 2022 నుంచి దేశంలోకి ప్రవేశించడానికి అనుమతించనున్నారు.ఈ మేరకు మంత్రి క్రిస్ హిప్కిన్స్ ఒక మీడియా సమావేశంలో ప్రకటించారు.రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న న్యూజిలాండ్ పౌరులు, పొరుగుదేశం ఆస్ట్రేలియాకు చెందిన వీసా హోల్డర్లు జనవరి 16 నుంచి న్యూజిలాండ్కు రావొచ్చు.
ప్రపంచంతో మళ్లీ కనెక్ట్ కావడానికి దశలవారీ విధానం వల్ల ముప్పు తగ్గుతుందని హిప్కిన్స్ అభిప్రాయపడ్డారు.దీని వల్ల ప్రయాణీకులు ఇకపై స్టేట్ క్వారంటైన్ కేంద్రాల వద్ద ఉండాల్సిన అవసరం లేదు.
అయితే కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్, టీకా పొందినట్లు ధ్రువీకరణ పత్రం మాత్రం తప్పనిసరిగా సమర్పించాలని ఆయన తెలిపారు.