ఏపీ సీఎం గా జగన్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి విరామం లేకుండా వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ, ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ, తనదైన ముద్ర వేసేందుకు జగన్ ప్రయత్నిస్తూనే వస్తున్నారు.జగన్ నిర్ణయాలు చాలా వరకు వివాదాస్పదమవ్వగా, మరెంతో మందికి ఆదర్శంగా మారాయి .
ఎన్నో రాష్ట్రాలు జగన్ నిర్ణయాలను మెచ్చుకుంటూనే, ఆయా రాష్ట్రాల్లో వాటిని అమలు చేస్తూ వస్తున్నాయి.జగన్ దూకుడు వ్యవహరించడంపై కొంతమంది ప్రశంసించినా, ఎక్కువమంది విమర్శిస్తూనే వచ్చారు .ఏ విషయం పైన లోతుగా ఆలోచన చేయకుండా జగన్ దూకుడు ముందుకు వెళుతున్నారని, ఏ నిర్ణయం అయినా వెంటనే అమలు జరగాలి అన్నట్లుగా కంగారు పడుతున్నారనే విమర్శలు ఎదుర్కొన్నారు.కేవలం వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడే కాకుండా, ప్రతిపక్షంలోనూ జగన్ వ్యవహారం ఇదే విధంగా ఉండేది .ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయించడం దగ్గర నుంచి ప్రతిదీ సంచలనంగానే జగన్ వ్యవహారం ఉండేది. ఇక గత టిడిపి ప్రభుత్వంలో తాము వ్యతిరేకించిన ఎన్నో నిర్ణయాలను జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేయించారు.
ముఖ్యంగా ఏపీ రాజధాని అమరావతి విషయంలో జగన్ వ్యవహారశైలి వివాదాస్పదం అయింది.అమరావతిని కొనసాగిస్తూనే మూడు రాజధానులు ప్రతిపాదన జగన్ చేశారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన వెనక్కి తగ్గలేదు.ఏడాదికి పైగా అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా జగన్ వెనక్కి తగ్గలేదు.
అయితే అనూహ్యంగా రెండు రోజుల క్రితం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు .అంతేకాదు సీఆర్డీఏ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి మరో సంచలనంకు కారణం అయ్యారు.
ఇదిలా ఉండగా నేడు శాసనసభలో మరో ప్రకటన చేశారు. శాసన మండలిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.జగన్ వరుసగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ఏపీలో ఎన్నికలు జరిగేందుకు ఇంకా రెండున్నరెళ్ళ కు పైగా సమయం ఉంది. అయితే ఇప్పుడు జగన్ తన నిర్ణయాలు, ఆలోచనలు ఒక్కొక్కటిగా వెనక్కి తీసుకోవడానికి కారణాలు వరుసగా ఏర్పడుతున్న ఇబ్బందుల కారణంగా తెలుస్తోంది .అది కాకుండా సాంకేతిక కారణాలతో కోర్టులోనూ తన నిర్ణయాలకు ఎదురుదెబ్బ తగులుతోంది.దీంతో ప్రతి దశలోను టిడిపిదేపై చేయిగా ఉంటు వస్తుండడం, ఇప్పుడు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాలు మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు జగన్ ప్రణాళికలు రచించడం ఇవన్నీ సంచలనం రేపుతూనే ఉన్నాయి.
టిడిపి, జనసేన , బీజేపీ లు వరుసగా ఏపీ ప్రభుత్వంపై పోరాటం చేయడం కారణంగానే జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారనే అభిప్రాయం కలగకుండా , ఆయా పార్టీలకు ఆ క్రెడిట్ వెళ్లకుండా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు .వెనక్కి తగ్గడానికి గల కారణాలు చెబుతూనే మరో ముందడుగు వేయబోతున్నట్టు గా సంకేతాలు ఇస్తూ ప్రతిపక్షాలకు మింగుడు పడని విధంగా తయారయ్యారు.