హుజురాబాద్ ఎన్నికలకు ముందు వరకు కేంద్ర బిజెపి పెద్దలతో సన్నిహితంగానే కెసిఆర్ మెలిగేవారు.తెలంగాణలో బిజెపి నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా, కేంద్రానికి మద్దతు పలికే వారు.
కానీ హుజూరాబాద్ ఎన్నికల సమయంలో కేంద్రం పైన తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కు పెట్టి, రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు.గతంలో కేంద్రం తీసుకున్న కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో కేసీఆర్ ఇదే వైఖరి అవలంబించారు.
ఇక కొద్ది రోజుల క్రితం వ్యవసాయ చట్టాల విషయంలోనూ, ధాన్యం కొనుగోళ్లు కేంద్రం చేపట్టాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ నిరసన దీక్ష కూడా చేపట్టారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన విడుదల చేయడంతో , ఇదంతా తమ క్రెడిట్ అన్నట్లుగా కేసీఆర్ ప్రకటనలు కనిపించాయి.
ఈ వ్యవహారాలు పార్టీలోను కాస్త ఊపు తీసుకురావడంతో, ఇక బీజేపీ పై దండయాత్ర మొదలు పెట్టాలని కేసీఆర్ డిసైడ్ అయిపోయారు .ఈ మేరకు నేడు కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు.ఈ సందర్భంగా కేంద్రం ముందు మూడు డిమాండ్లను ఆయన వినిపించేందుకు సిద్ధమయ్యారు.చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షల పరిహారం, రైతులపై నమోదైన కేసులు ఎత్తివేత, కనీస మద్దతు ధర చట్టం.
ఈ మూడు అమల్లోకి తీసుకురావాలని కేసీఆర్ డిమాండ్ చేయబోతున్నారు. అదే విధంగా తెలంగాణలో తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ తేల్చాలని కేంద్ర పెద్దలతో కెసిఆర్ చర్చించబోతున్నారు.
ఈమేరకు మంత్రులు , ఎమ్మెల్యేలతో కలిసి నేడు ఢిల్లీకి కేసీఆర్ వెళ్తున్నారు.చాలా రోజులుగా ధాన్యం కొనుగోళ్ల విషయమై పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళన నిర్వహిస్తున్నా, కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శలు చేస్తున్న కేసీఆర్ ఇదే విషయాన్ని కేంద్ర బీజేపీ పెద్దలతోనూ, అధికారులతోనూ, ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది.
ఇక ప్రధానమంత్రి నరేంద్రమోడీ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు .అదీ దొరికితే మరిన్ని అంశాలపై క్లారిటీ తెచ్చుకోవాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్లు గానే రైతులపై కేసులు కూడా ఎత్తివేయాలని కేసీఆర్ డిమాండ్ చేసే అవకాశం ఉంది.రైతు పోరాటంలో మరణించిన దాదాపు 750 కుటుంబాలకు తెలంగాణ తరఫున మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఒక్కో కుటుంబానికి అందజేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు .అలాగే కేంద్రం కూడా తన బాధ్యతగా ఒక్కో కుటుంబానికి 25 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని కేసీఆర్ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు.తమ డిమాండ్ల విషయంలో కేంద్ర బిజెపి పెద్దలు సానుకూలంగా స్పందిస్తే సరేనని, అలా కాకుండా పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తే కేంద్రంపై రకరకాల మార్గాల్లో ఒత్తిడి పెంచాలనే అలోచఅనలో కేసీఆర్ ఉన్నారట.