ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 కోట్ల జీవులు ఒకేసారి జనజీవనంలోకి ప్రవేశిస్తే ఆ సన్నివేశం ఎలా ఉంటుంది? ఫిక్షనల్ థ్రిల్లర్ కి ఏ మాత్రం తీసిపోదు కదా! ఆకాశంలో వరుసగా వందలకొద్దీ పక్షులు వెళ్లడం చూసి మనం అబ్బురపడిపోతుంటాం.కానీ జనం సంచరించే రోడ్లపై ఇతర అటవీ జీవులు వందల సంఖ్యలో ప్రత్యక్షం కావడం మీరు చూసి ఉండరు.
అయితే ఆస్ట్రేలియా దేశంలో ఒక అద్భుత దృశ్యం కనిపించింది.ఆస్ట్రేలియా క్రిస్మస్ ఐలాండ్ లో వర్షాకాలం మొదలైంది.
అలా వర్షాకాలం వచ్చేసింది లేదో జత కట్టడానికి, గుడ్లు పెట్టడానికి కోట్ల సంఖ్యలో ఎర్రటి పీతలు బయటకు వచ్చాయి.ఇవి క్రిస్మస్ ఐలాండ్ లోని ఓ అడవి నుంచి సముద్రానికి వలస వెళ్లేందుకు తమకు అడ్డు వచ్చిన సిటీ రోడ్డులను మొత్తం బ్లాక్ చేశాయి.
ఎర్రగా కాంతివంతంగా కనిపించే ఈ రెడ్ క్రాబ్స్ కోట్ల సంఖ్యలో రోడ్లపై తరలి వెళ్తుండడాన్ని అక్కడి ప్రజలు కళ్ళార్పకుండా చూస్తున్నారు.
నిజానికి ఈ పీతల కోసమే ప్రత్యేకంగా ఒక బ్రిడ్జి కూడా కట్టారు.
ప్రతియేటా ఈ పీతలు అనేక రహదారులు దాటుతూ ఆ బ్రిడ్జిపై నుంచి సముద్రానికి వెళ్తుంటాయి.ఇది చూసిన ఆస్ట్రేలియా ప్రజలు పీతల నేచురల్ ప్రాసెస్ ఇంత బాగుంటుందా అని ఫిదా అవుతుంటారు.
పెద్దగా ఉండే మగ పీతలు ముందుగా నడుస్తుంటే వాటిని ఆడ పీతలు ఫాలో అవుతాయి.ఇండియన్ ఓషన్ వద్దకు వెళ్లిన తర్వాత అక్కడ లేదా అక్కడే ఉన్న బోరియల్లో ఇవి జత కడతాయి.
తర్వాత ఆడ పీతలు అయిదు రోజుల వరకు సముద్రం దగ్గరే ఉండి.అక్కడే గుడ్లను పెడతాయి.ఆ గుడ్లను అక్కడే వదిలేసి వెనుదిరుగుతాయి.కొన్ని మాత్రం తమ గుడ్లను తినేస్తుంటాయి.
ఈ గుడ్లు పొదిగి పిల్లలు కావడం ఒక పెద్ద సవాలేనని చెప్పుకోవచ్చు.
అయితే ఈ పీతలకు ఎలాంటి హాని కలగకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా రోడ్లను బ్లాక్ చేస్తుంది.ఎండ్రకాయలు వెళ్లే రహదారి గుండా ఎలాంటి వాహనాలు వెళ్లకుండా తగిన చర్యలు చేపడుతుంది.ఐలాండ్ పర్యావరణ వ్యవస్థను కాపాడడంలో పీతలు కీలకపాత్ర పోషిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.అయితే ఈ దృశ్యాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.“వామ్మో ఇన్ని పీతలా.ఇది నేచర్ వండర్, సూపర్” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.