కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.దీంతో అన్ని దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఉద్ధృతంగా నిర్వహిస్తున్నాయి.
ప్రజలు స్వచ్ఛందంగానే వ్యాక్సిన్ వేయించుకుని ప్రభుత్వానికి సహకరిస్తున్నారు.కొన్ని చోట్ల నిర్బంధంగానైనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు.
ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తమకు అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయని పరిహారం చెల్లించాలంటూ వేలాది మంది ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు.
దీంతో ప్రభుత్వం కోవిడ్ టీకా కార్యక్రమానికి సంబంధించి 50 మిలియన్ డాలర్ల బిల్లును ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
వ్యాక్సిన్ తీసుకున్న వారు దుష్ప్రభావాలకు గురవుతూ వుండటంతో ఆసుపత్రుల పాలవుతున్నారు.
దీంతో తాము విధుల్లో చేరలేకపోవడం వల్ల కోల్పోయిన ఆదాయాన్ని చెల్లించాలంటే 10,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.ఈ నష్టపరిహారం 5,000 డాలర్లుగా వుంటుందని అంచనా.దీని ప్రకారం ప్రతి ఒక్కరికి క్లెయిమ్ చేయాలంటే దాదాపు 50 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లు ఖర్చు చేయాల్సి వుంటుంది.
ఆస్ట్రేలియా థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్ ప్రకారం దేశంలో 36.8 మిలియన్ డోసుల వ్యాక్సిన్ పంపిణీ అవ్వగా అందులో దాదాపు 79,000 మందిలో దుష్ప్రభావాలు తలెత్తినట్లు ఫిర్యాదులు అందాయి.ముఖ్యంగా చేయి నొప్పి, తలనొప్పి, జ్వరం , చలి వంటివి చోటుచేసుకుంటున్నాయి.
ఫైజర్ వ్యాక్సిన్ వల్ల గుండెల్లో మంటగా అనిపిస్తున్నట్లు 288 ఫిర్యాదులు అందాయి.అలాగే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ తలెత్తినట్లు 160 ఫిర్యాదులు అందాయి.
వీరంతా కూడా 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు గలవారు.
ఇకపోతే.కరోనా వైరస్తో ఆస్ట్రేలియా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఒక్కొక్క నగరం డెల్టా వేరియంట్ పడగ నీడలోకి వెళ్లిపోవడంతో గత్యంతరం లేని పరిస్ధితుల్లో లాక్డౌన్ విధించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం.
ప్రజల నుంచి నిరసన వ్యక్తమైనా సరే సైన్యాన్ని రంగంలోకి దించి మరి కఠినంగా వ్యవహరించింది.వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడంతో పాటు ఆంక్షల కారణంగా ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.
సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా సహా కీలక నగరాల్లో లాక్డౌన్ ఎత్తివేసిన విషయం విదితమే.కాగా.దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన న్యూసౌత్వేల్స్ రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 212 కేసులు నమోదవ్వగా… విక్టోరియాలో 797 కేసులు వెలుగు చూశాయి.