ఈ మధ్య కాలంలో పాత నాణేలు, కరెన్సీ నోట్లను అమ్మడం కొనడం లాంటి కార్యక్రమాలు ఎక్కువ అయిపోయాయి.కొంతమంది ఇలా పాత నాణాలను సేకరించడం, అమ్మడంను హాబీలాగా కూడా మార్చేసుకున్నారు.
ఈ క్రమంలోనే కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ లు పాత నాణేలు వేలం పాటను నిర్వహిస్తూ అమాయకుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తుంది.మీ దగ్గర పాత నోటు ఉంటే మీ దశ తిరిగినట్లే అని భారీ మొత్తంలో నజరానా ప్రకటిస్తోంది.
అందుకే చాలా మంది చెల్లుబాటులో లేని నాణేలను ఆన్లైన్, ఆఫ్లైన్ ప్లాట్ఫారమ్ ల ద్వారా విక్రయించి పెద్ద మొత్తంలో డబ్బులను దండుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇలా పాత నాణేలు, కరెన్సీ నోట్లను ట్రేడ్ చేసే వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ఒక ప్రకటన జారీ చేసింది.ముందుగా ప్రజలు అందరూ ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పై అవగాహన పెంచుకోవాలని ఆర్బీఐ తన అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రజలకు ఒక ట్వీట్ చేసారు.”రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు, లోగోను కొంత మంది వ్యక్తులు ఆన్లైన్ లో పాత కరెన్సీ నోట్ల విక్రయంలో ఉపయోగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది.చెల్లుబాటులో లేని పాత నాణేలు, పాత నోట్లను విక్రయిస్తూ ప్రజల నుంచి కమీషన్లు,పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఆర్బీఐ ఎప్పుడూ కూడా అలాంటి కార్యకలాపాల్లో పాల్గొనదు.అలాగే ఇలాంటి పాత నాణాల విక్రయాలను నిర్వహించే బాధ్యతను కూడా ఏ సంస్థకు లేదా వ్యక్తికి ఆర్బిఐ అప్పచెప్పలేదు.ఒకవేళ ప్రభుత్వం పాత నాణేల కోసం ఈ-వేలం నిర్వహిస్తే తప్పకుండా అధికారికంగా ప్రకటన అనేది జారీ చేస్తుంది.
దయచేసి ఇలా పాత నాణేలను కొనుగోలు చేసే క్రమంలో సైబర్ నేరగాళ్ల నుండి జాగ్రత్త వహించండి “అని ఆర్బీఐ తెలిపింది.ఇలా పాత నాణేలను కొనుగోలు, విక్రయించే సమయంలో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ మరోసారి ప్రజలను హెచ్చరించింది.