రాజకీయాలు అన్న తర్వాత గెలుపు, ఓటములు అనేవి సహజం.కానీ ఓడిపోయామని చేతులు కట్టుకుని కూర్చుంటే లాభం లేదు కదా.
అందుకే ఓడిపోయన చోటే చాలామంది నేతలు మళ్లీ పంజా విసిరేందుకు వ్యూహాలను రచిస్తుంటారు.ఇందులో కొందరు సక్సెస్ అయితే మరి కొందరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండి చేజేతులా అవకాశాన్ని వదులుకుంటారు.
అయితే ఇప్పుడు పవన్ కూడా తాను ఓడిన చోటే పంజా విసిరేందుకు రెడీ అవుతున్నారు.పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఓడిపోవడం ఎంత పెద్ద నష్టమో ఆయనకు తెలియనిది కాదు.
అందుకే ఈ సారి ఎలాగైనా మళ్లీ సత్తా చాటేందకు రెడీ అవుతున్నారు.ఈ మధ్య వీలు దొరికితే చాలు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించేందుకు రెడీ అవుతున్నారు పవన్ కల్యాణ్.
ఇందులో భాగంగా ఆయన కోస్తా జిల్లాల్లోనే తన పర్యటనలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు.ఇందులో భాగంగా ఆయన గాజువాక నియోజకవర్గాన్ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.అక్టోబర్ 31 నుంచి వచ్చే నెల నవంబర్ 2 వ తారీఖు దాకా ఆయన కోస్తా ఆంధ్రా జిల్లాలో పర్యటన పెట్టుకున్నారు.ఇందులో భాగంగా ఆయన విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు తెలుపనున్నారు.
దాదాపు 250 రోజులుగా ఈ కంపెనీకి చెందిన కార్మికులు ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న విషయం అందరికీ విదితమే.కాగా కేంద్రం మాత్రం దీన్ని ప్రయివేటీకరిస్తామని ఖరాకండిగా చెబుతున్న నేపథ్యంలో పవన్ పర్యటన ఆసక్తికరంగా మారింది.పైగా స్టీల్ ప్లాంట్ ఉన్నది పక్కాగా గాజువాక నియోజకవర్గంలో కావడం ఇక్కడ విశేషం.
పవన్ గతంలో పోటీ చేసి కొద్ది పాటి తేడాతో ఓడిపోయిన ఈ నియోజకవర్గం కిందనే కార్మిక కుటుంబాలు అధికంగా ఉన్నాయి.అంటే పవన్ ఈ నియోజకవర్గంలో మరోసారి తన పంజా విసరబోతున్నారన్న మాట.
మరి ఆయన పర్యటనలో ఏం మాట్లాడుతారో చూడాలి.