మన దేశం అభివృద్ధి దిశగా ముందుకు దూసుకుపోతున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఇంకా అభివృద్ధి చెందాలిసింది చాలా ఉంది.
ఎంతసేపు పట్టణాలలోనే అభివృద్ధి జరిగితే ఎక్కడో మారు మూల ఉండే ప్రజల సంగతి ఏంటి అని ఎవరు కూడా ఆలోచించడం లేదు.వారికి తిండి సౌకర్యం ఉందా, రోడ్డు రవాణా సౌకర్యం ఉందా అని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు.
మన దేశం ఎంతో అభివృద్ధి చెందింది అంటారు.సరైన రోడ్డు సదుపాయాలు లేక చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రవాణా సౌకర్యం లేని కారణం చేత తమ కాళ్ళకే పని చెప్పి నడక పయనం చేస్తున్నారు.తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఛత్తీస్గఢ్ లోని మారుమూల ప్రాంతంలో వెలుగు చూసింది.
అక్కడ గ్రామాల ప్రజల పరిస్థితి మరి దారుణంగా ఉంది.రోడ్డు సౌకర్యం లేక అక్కడి ప్రజలు పడే కష్టాలకు సంబందించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అక్కడ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఆ గ్రామంలోని టీచర్లు తమ భుజాలపైనే వంట సరుకులు మోసుకుని మరి వెళ్ళారు.ఒకటా రెండా అలా దాదాపు 8 కిలోమీటర్ల మేర భుజాలపై ఆ వంట సరుకులు మోసుకుని వెళ్ళారు.
బల్ రాంపూర్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.ఆ గ్రామంలోని స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించేందుకు టీచర్లు నానా కష్టాలు పడుతున్నారు.వంట సరుకులను భుజాలపై మోస్తూ దారిలో ఎదురయ్యే గుట్టలు, కాలువలను దాటుకుంటూ ముందుకెళ్తున్నారు.పిల్లలను ఆకలితో ఉంచడం సరికాదని అందుకే ఎంత కష్టం అయినా సరే మేము ఇలా చేస్తున్నాము అని అక్కడ టీచర్లు వాపోయారు.
కాగా, తమ గ్రామానికి రోడ్డు వేయాలని ప్రభుత్వానికి చాలా సార్లు విజ్ఞప్తి చేశామని కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని అంటున్నారు.ఇకనైనా మా కష్టాన్ని గుర్తించి రోడ్డు మార్గం వేసి తమ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.ఈ ఘటన పై బలరాంపూర్ జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ స్పందించారు.‘మా ఇద్దరు టీచర్లు సుశీల్ యాదవ్, పంకజ్.రేషన్ షాపు నుంచి వంట సరుకులు తీసుకుని కొండల్లో ఉన్న మారుమూల గ్రామానికి తమ భుజాలపై మోసుకుంటూ కాలినడకన వెళ్తున్నారు.పిల్లల ఆకలి తీర్చడానికి వాళ్ళు చేసే కృషి పట్ల నేను సెల్యూట్ చేస్తున్నా’ అని డీఈవో ఎక్కా తెలిపారు.
నెటిజన్లు సైతం ఆ టీచర్ల సాహసానికి ఫిదా అయిపోయారు.