హుజురాబాద్ గడ్డ మీద కాషాయ జెండా రెపరెపలాడుతుందో లేక గులాబీ గుబాలిస్తుందో త్వరలో తెలిసిపోనుంది.విజయం కోసం రెండు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
కానీ ఇక్కడ ఒక్క విషయం మాత్రం చాలా మందికి అంతు చిక్కడం లేదు.అసలు హుజురాబాద్ నియోజకవర్గంలో నారీమణుల ఓట్లు ఎవరికి ప్లస్ అవుతాయో తెలియక చాలా మంది తికమక పడుతున్నారు.
టీఆర్ఎస్, బీజేపీల నుంచి అగ్రస్థాయి నేతలంతా ప్రచారంలో తల మునకలయ్యారు.త్వరలో స్వయానా ముఖ్యమంత్రే హుజురాబాద్ ప్రచారానికి వస్తారని పలువురు చర్చించుకుంటున్నారు.
టీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపు మీద బీజేపీని చీల్చి చెండాడుతోంది.ఈటల రాజేందర్ స్వార్థం వలనే ఇక్కడ ఉప ఎన్నిక వచ్చిందని ఆరోపిస్తోంది.
బీజేపీ టీఆర్ఎస్ పోరు అలా పక్కకు ఉంచితే కాంగ్రెస్ కూడా ఇక్కడ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది.కాంగ్రెస్ పీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఎలాగైనా హుజురాబాద్ లో సత్తా చాటాలని చూస్తున్నారు.
ఇదిలా ఉంటే అసలు నియోజకవర్గంలో మహిళలు ఎటువైపు ఉంటారనేది ఎవరికీ సరిగ్గా అంతు చిక్కడం లేదు.మహిళ సంఘ భవనాలకు టీఆర్ఎస్ నిధులు మంజూరు చేస్తున్నా కానీ మహిళలంతా గంప గుత్తగా టీఆర్ఎస్ కే ఓటు వేస్తారని గ్యారంటీ లేదు.
మరోవైపు మహిళల ఓట్లను రాబట్టుకునేందుకు బీజేపీ నేత రాజేందర్ సతీమణి జమున రెడ్డి స్వయంగా ప్రచారం చేస్తున్నారు.
భర్త గెలుపే లక్ష్యంగా రేయింబవళ్లు కష్టపడుతున్నారు.
అయినా కానీ నియోజకవర్గ మహిళల నాడి అర్థం కావడం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ట్రబుల్ షూటర్ హరీశ్ రావు కూడా ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
మరి నారీమణులను ఎవరు తమ వైపుకు తిప్పుకుంటారో రిజల్ట్స్ వస్తే కానీ తెలిసే అవకాశం లేదంటున్నారు విశ్లేషకులు.