ప్రవాస భారతీయుల సంక్షేమానికి పెద్ద పీట వేసే రాష్ట్రాలలో పంజాబ్ కూడా ఒకటి.ఈ రాష్ట్రానికి చెందిన ప్రజలు వివిధ దేశాలలో స్థిరపడిన సంగతి తెలిసిందే.
వీరికి తోడ్పాటును అందించేందుకు గాను ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖను కూడా పంజాబ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వచ్చే సమయంలో విమానాశ్రయాలలో ఎన్ఆర్ఐలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి 24 గంటల పాటు పనిచేసేలా ప్రతిస్పందన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి పర్గత్ సింగ్ తెలిపారు.
శుక్రవారం ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ సమీక్షా సమావేశంలో పర్గత్ మాట్లాడుతూ.డాక్యుమెంటేషన్, సాంకేతిక కారణాల కారణంగా విమానాశ్రయాలలో ఎన్ఆర్ఐలను నిలిపివేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.
అలాంటి సందర్భాలలో వారికి సహాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలూ నిరంతరాయంగా పనిచేసే ప్రతిస్పందన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.ఎన్ఆర్ఐల సమస్యలను పరిష్కరించేందుకు నిపుణులను నియమిస్తామని.
వారిని నేరుగా ప్రవాస భారతీయులు సంప్రదించి సాయం పొందవచ్చని పర్గత్ వెల్లడించారు.అలాగే ఆస్తి, క్రిమినల్, వైవాహిక ఇతర కేసులలో ఎన్ఆర్ఐల ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రతి జిల్లాలో అధికారుల నియామకానికి కసరత్తు చేస్తునట్లు మంత్రి తెలిపారు.
ఈ మేరకు రెవెన్యూ, పోలీసు శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పర్గత్ పేర్కొన్నారు.అలాగే చండీగడ్కు వచ్చేందుకు వెరిఫికేషన్ విషయంలో ఇబ్బందులు పడుతున్న వారికి కూడా మంత్రి శుభవార్త చెప్పారు.
సువిధ, సంఝా కేంద్రాల ద్వారా ఆన్లైన్లోనే వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా పర్గత్ అధికారులను ఆదేశించారు.
కాగా, కొద్దిరోజుల క్రితం అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఎన్ఆర్ఐ సంఘం నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ (ఎన్ఏపీఏ) పర్గత్ సింగ్కు ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖను కేటాయించాల్సిందిగా గట్టి లాబీయింగ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీకి వేర్వేరుగా రాసిన లేఖల్లో ఎన్ఏపీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చాహల్ కోరారు.పంజాబీ ప్రవాసులలో ఎక్కువ మంది దోబా ప్రాంతానికి చెందిన వారేనని.
అందువల్ల ఎన్ఆర్ఐ వ్యవహారాలను చూసే మంత్రి అదే ప్రాంతానికి చెందినవారై వుండాలని సత్నామ్ సింగ్ సూచించారు.అందువల్ల ఈ పోర్ట్ఫోలియోకు పర్గత్ సింగ్ సరైన వ్యక్తని ఆయన చెప్పారు.
ప్రస్తుతం వివిధ దేశాల్లో స్థిరపడ్డ పంజాబీ ప్రవాసులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని.వీటిని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం వుందని సత్నామ్ సింగ్ అన్నారు.
అలాగే పంజాబీ ప్రవాసులకు సంబంధించిన వివాదాలపు పరిష్కరించేందుకు గాను దోబా ప్రాంతంలో మరిన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వుండాలని ఆయన డిమాండ్ చేశారు.