జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి ఏమిటో బిజెపి నేతలకు అస్సలు అర్థం కావడం లేదు. అసలు ఆయన తమ పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలి అనుకుంటున్నారో లేక తెగతెంపులు చేసుకోవాలని అనుకుంటున్నారో అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.
అసలు రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి తప్ప ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం తో ముందుకు వెళ్లడం లేదు.ఈ క్రమంలోనే బిజెపితో పొత్తు రద్దు చేసుకుని టిడిపితో జనసేన ముందుకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం గత కొంతకాలంగా ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతూనే ఉంది.
అయితే బిజెపి మాత్రం జనసేన బిజెపి కలిసే 2024 లో పోటీ చేస్తాయని పదేపదే చెబుతున్నారు ఇదే విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సైతం ప్రస్తావించారు.
ప్రస్తుతం బద్వేల్ ఉప ఎన్నికల్లో విషయాన్నే తీసుకుంటే , ఇక్కడ జనసేన తాను పోటీ చేయడం లేదని ప్రకటించింది.దీంతో బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది.ఇంకా ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది.
ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతారని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించినా పవన్ మాత్రం ఆ ప్రచారానికి వెళ్లేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు.బద్వేల్ ఉప ఎన్నికల విషయంలో ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి.
ముందుగా బద్వేల్ ఉప ఎన్నిక పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్ చర్చించుకున్న సమయంలో తాము పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నామని పవన్ సోము వీర్రాజు కు చెప్పారట.కానీ ఆ తర్వాత రోజు అనంతపురం లో పర్యటించిన పవన్ ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గంలో జనసేన పోటీ చేయడం లేదంటూ ప్రకటించారు.
ఈ వ్యవహారంపై బీజేపీ ఆగ్రహం చెంది వెంటనే తాము ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని అంటూ ప్రకటించింది.అంతేకాదు స్వయంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి వస్తారంటూ బీజేపీ ప్రకటించింది.అయితే గత మూడు రోజులుగా ఏపీ లో టిడిపి , వైసిపి దాడులు వ్యవహారం లో జనసేన స్పందించింది.టిడిపి కార్యాలయాలపై దాడులు వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకుని వీడియో సందేశం ద్వారా దానిని ఖండించారు.
కానీ బద్వేల్ ఉప ఎన్నికలలో తమ మిత్రపక్షమైన బీజేపీ పోటీ చేస్తున్న పవన్ కనీసం ప్రచారానికి రాకపోగా, వీడియో సందేశాన్ని సైతం వినిపించేందుకు ఇష్టపడకపోవడం పై కమలనాథులు గుర్రుగా ఉన్నారు.ఉప ఎన్నిక తంతు ముగిసిన తర్వాత ఈ రెండు పార్టీలు పొత్తు విషయంలో గాని, కలిసి ముందుకు వెళ్లే విషయంలో కానీ సీరియస్ గానే చర్చించాలనే ఆలోచనలో బిజెపి నేతలు ఉన్నట్లు సమాచారం.