రాజకీయాల్లో ఎప్పుడు ఎవరిని అదృష్టం వరిస్తుందో.ఎవరిని దురదృష్టం వరిస్తుందో చెప్పడం చాలా కష్టం.
కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం మనకు అదృష్టం ఎలా రాబోతున్నదని ముందుగానే తెలుస్తుంది.కానీ, ఆ సమయంలో కూడా తలుపు వేసుకుని కూర్చుకుంటే వచ్చిన ‘లక్’ కాస్త అటునుంచి అటే వెళుతుంది.
ప్రస్తుతం దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే దేశరాజకీయాలను తన వ్యుహలతో శాసిస్తున్న ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.ఆయన కూడా అందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని పీకే భావించారని కూడా తెలుస్తోంది.
అయితే, ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
జాతీయ స్థాయిలో సరైన నాయకత్వం లేకపోవడమే ఆ పార్టీకి పెద్ద మైనస్.ఇకపోతే యువనేత అని పిలువబడుతున్న రాహుల్ గాంధీ అసమర్థత కూడా ఆ పార్టీ వరుస ఓటములకు కారణమని పొలిటికల్ విశ్లేషకులు బహిరంగంగానే చెబుతున్నారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి అదృష్టం ప్రశాంత్ కిషోర్ రూపంలో వస్తే.ఆ పార్టీకి చెందిన కొందరు నేతల దూరదృష్టి ప్రశాంత్ కిషోర్ను పార్టీలో చేరకుండా చేసినట్టు తెలుస్తోంది.
చేయి దాకా వచ్చిన అదృష్టాన్ని కాంగ్రెస్ పార్టీ చేజేతులా వదులుకున్నట్టు రాజకీయాలో జోరుగా చర్చ నడుస్తోంది.ఒకప్పుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు పొలిటికల్ సెక్రెటరీగా చేసిన దివంగత సీనియర్ కాంగ్రెస్ లీడర్ అహ్మద్ పటేల్ మాదిరిగా రాహుల్ వద్ద ముఖ్యపాత్ర పోషించాలన్నది పీకే ఆలోచనగా అంతా చెబుతారు.
అయితే, ఒక బయటి వ్యక్తిని అంతటి పదవి ఇవ్వడం, అది కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వారికి ఇస్తే కాంగ్రెస్ పార్టీకే ప్రమాదమని పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తంచేసినట్టు సమాచారం.ఈ క్రమంలోనే పీకే కాంగ్రెస్ లో చేరే ఆలోచనను మానుకున్నట్టు తెలిసింది.అదే సమయంలో ఆయన బెంగాల్ ముఖ్యమంత్రి మమతతో కలిసి పని చేయాలని భావించినట్టు తెలుస్తోంది.ఇదివరకే సోనియా, రాహుల్, ప్రియాంకలతో భేటి అయిన పీకే తన నిర్ణయాన్ని వారి ముందు పెట్టగా.
ఆ పార్టీ నుంచి అందిన సంకేతాలతో ఆయన కాంగ్రెస్లో చేరాలనే ఆలోచనను విరమించుకున్నట్టు తెలిసింది.దీంతో కాంగ్రెస్ మరోసారి తన అదృష్టాన్ని కాలదన్నుకున్నదని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.