ఈ ఏడాది మే, జూన్ నెలల్లో కెనడాలోని మూసివేసిన ప్రఖ్యాత ‘కామ్లూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్’ ప్రాంగణంలో ఒకేసారి 215 మంది పిల్లల అస్థిపంజరాలు బయటపడటంతో ప్రపంచం ఉలిక్కిపడింది.రాడార్ ద్వారా లభ్యమైన సమాచారంతో ఈ దారుణం బయటి ప్రపంచానికి తెలిసింది.
ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు దేశవ్యాప్తంగా మూసివున్న రెసిడెన్షియల్ స్కూళ్లపై దృష్టిసారించారు.ఈ క్రమంలో కొవెస్సెస్ ఫస్ట్ నేషన్ ప్రాంతంలోని ‘‘ మారివల్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్ ’’ ప్రాంగణంలో రాడార్ ద్వారా అన్వేషించగా వందలకొద్దీ సమాధులు బయటపడ్డాయి.600 మందికి పైగా చిన్నారులను సమాధి చేసినట్లు భావిస్తున్న అధికారులు తవ్వకాల ద్వారా పిల్లల అవశేషాలను బయటకు తీస్తున్నారు.ఈ ఆశ్రమ పాఠశాల 1899 నుంచి 1997 మధ్య రోమన్ కాథలిక్ చర్చి ఆధ్వర్యంలో నడిచింది.
ఈ నేపథ్యంలో 215 మంది చిన్నారుల అవశేషాలు బయటపడిన కామ్లూప్ పాఠశాల వద్ద కమ్యూనిటీని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో త్వరలో పరామర్శిస్తారని ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.దేశానికి పశ్చిమాన వున్న బ్రిటీష్ కొలంబియా కమ్యూనిటీకి ప్రధాన మంత్రి వెళ్లడం ఇదే మొదటి సందర్శన.
అధికార వర్గాల సమాచారం అక్టోబర్ 18న కామ్లూప్స్ను సందర్శిస్తారని టాక్.ఇప్పటికే జరిగిన సంఘటనపై ప్రధాని ట్రూడో జాతికి క్షమాపణలు చెప్పారు.అయితే మరణించిన పిల్లలకు నివాళీగా జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు రావాల్సిందిగా ప్రధాని పంపిన రెండు లేఖల పట్ల కామ్లూప్ కమ్యూనిటీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.ఈ క్రమంలో స్వయంగా జస్టిన్ ట్రూడో కామ్లూప్కు వెళ్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
19వ శతాబ్దం నుంచి 1970ల వరకు కెనడాలో దాదాపు లక్షన్నర మందికిపైగా చిన్నారులను క్రిస్టియన్ స్కూళ్లలో బలవంతంగా చేర్చినట్లు రికార్డులు చెబుతున్నాయి.ఈ పాఠశాలల్లో అత్యధికం. రోమన్ కాథలిక్ మిషనరీ ఆధ్వర్యంలోనే నడిచేవి.ఈ పాఠశాలల్లో బలవంతపు మత మార్పిళ్లు జరిగేవనీ, తమ మాట వినకుంటే ఎంతటి దారుణానికైనా నిర్వాహకులు వెనుకాడే వారు కాదని కెనడాలో కథలు కథలుగా చెప్పుకుంటారు.
చిన్నారులపై శారీరక, లైంగిక వేధింపులు జరిగేవని, మాతృభాష మాట్లాడినందుకు పిల్లలను తీవ్రంగా కొట్టేవారని తేలింది.ఇలాంటి చర్యల వల్ల కొన్నేళ్లలో దాదాపు 6 వేల మంది చిన్నారులు చనిపోయి ఉంటారని ఒక అంచనా.
సరిగ్గా పట్టించుకోకపోవడం, చిత్రహింసలు కాకుండా అంతకుమించిన స్థాయిలోనే పిల్లలపై ఏదో దారుణం జరిగి వుండటం వల్లే ఈ స్థాయిలో పిల్లలు చనిపోయి వుంటారని నిపుణులు వాదిస్తున్నారు.పిల్లల మరణానికి కారణమైన మిస్టరీని ఛేదించేందుకు పరిశోధకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.