హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి అనే పట్టుదలతో కమలనాథులు కనిపిస్తున్నారు.ఇక్కడ 2023 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అధికారం దక్కుతుందని నమ్ముతున్నారు.
అధికార పార్టీ టిఆర్ఎస్ ఇక్కడ గెలిచేందుకు ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తున్నాయి.ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతతో పాటు, బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఈటెల రాజేందర్ పై స్థానికంగా నెలకొన్న సానుభూతి, ఈ నియోజకవర్గంలో ఆయనకు గట్టిపట్టు ఉండడం ఇవన్నీ తమకు కలిసి వస్తాయనే లెక్కల్లో బిజెపి నేతలు ఉన్నారు.
అయితే అధికార పార్టీ టిఆర్ఎస్ ఇక్కడ గెలుపు కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టడం, బిజెపిలో కీలకమైన నాయకులను టిఆర్ఎస్ లో చేర్చుకునే పనుల్లో నిమగ్నం కావడం, సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యం కల్పిస్తూ ఉండడం, ఇవన్నీ కాస్త ఆందోళన పెంచుతున్నాయి.అంతేకాకుండా టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు ఈ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు.
ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను కలిసే విధంగా ఆయన ప్రణాళిక రచించడం తో పాటు, దానిని అమలులో పెట్టారు.ఇవన్నీ బీజేపీ కి ఆందోళన పెంచుతున్నాయి.ఇక టిఆర్ఎస్ విషయానికి వస్తే ఈ హుజూరాబాద్ నియోజకవర్గం లో భారీ బహిరంగ సభను నిర్వహించి, కేసీఆర్ తో ఈ మీటింగ్ ను హైలెట్ చేస్తే ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని, గతంలో దుబ్బాక ఎన్నికలలో కెసిఆర్ ప్రచారానికి వస్తే ఫలితం ఉండేది అనే విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.అయితే ఇప్పుడు భారీ బహిరంగ సభ నిర్వహించాలని చూస్తున్నా దానికి ఎన్నికల సంఘం విధించిన నిబంధనలు అడ్డుగా మారాయి.
ఇప్పటికే ఈ విషయంపై ఎన్నికల సంఘానికి టిఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది.
ఈసీ నిర్ణయం కనుక అనుకూలంగా వెలువడితే హుజురాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని, అలా కుదరని పక్షంలో హుజురాబాద్ నియోజకవర్గానికి దగ్గరగా ఉన్న ప్రాంతంలో సభను ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంది.బిజెపి సైతం ఇదే విధంగా భారీ బహిరంగ సభ ప్లాన్ చేసుకుంటోంది.అయితే టిఆర్ఎస్ పై పట్టు సాధించాలన్నా, ఆ పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి పైచేయి సాధించాలంటే ఖచ్చితంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కే సాధ్యమని, ఆయన వస్తేనే ఫలితం తమకు అనుకూలంగా ఉంటుంది అనే అంచనా లో బిజెపి ఉంది.
దసరా పండుగకు ముగియడంతో ఇక పూర్తి స్థాయిలో బీజేపీ లో కీలక నాయకులందరినీ హుజురాబాద్ లో ఉండేలా , ప్రతి ఓటర్ ను బీజేపీ శ్రేణులు వెళ్లి కలిసేలా ప్లాన్ చేశారు.ఇక తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఐదు మండలాల్లో ని ప్రతి గ్రామానికి ఆయన వెళ్లే విధంగా ప్లాన్ చేసుకున్నారు.గడపగడపకు వెళ్లి ఓటర్లను కలవాలని సంజయ్ సిద్ధం అవుతున్నారు.
హుజురాబాద్ ఎన్నికలలో గెలిస్తే టిఆర్ఎస్ పై పైచేయి సాధించేందుకు సాధ్యమవుతుందని, 2023 ఎన్నికల్లో విజయం సాధించేందుకు హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితం ప్రభావం చూపిస్తుందనే నమ్మకంతో తెలంగాణ బిజెపి నేతలు ఉన్నారు.ఎన్నికల ప్రచారం ముగింపు రోజున కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, కెసిఆర్, టిఆర్ఎస్ పైన విమర్శలు చేయించాలనే ఆలోచనలో తెలంగాణ బిజెపి నేతలు ఉన్నారు.