ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలోని పాపయ్య వలస గ్రామం ఇప్పుడు సందడిగా మారింది.వైసీపీకి చెందిన కొంతమంది కీలక వ్యక్తులు ఈ గ్రామానికి క్యూ కడుతూనే ఉండడంతో ఒక్కసారిగా ఈ గ్రామం పేరు వార్తల్లోకి ఎక్కింది.
అసలు వైసీపీ నేతలకు ఈ గ్రామానికి ఉన్న లింకేంటి ? ఎక్కడెక్కడో ఉన్నవారంతా ఇక్కడికి ఎందుకు క్యూ కడుతున్నారు.అనేది చర్చనీయాంశం అయింది ప్రస్తుతం వైసీపీ లో సందడి వాతావరణం నెలకొంది .మరి కొద్ది నెలల్లోనే జగన్ మంత్రి మండలిని విస్తరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు .ప్రస్తుతం ఉన్న మంత్రులలో చాలామందిని తప్పించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవాలని చూస్తున్నారు.దీంతో కొత్త మంత్రి పదవులపై చాలామంది నాయకులే ఆశలు పెట్టుకున్నారు.జగన్ దృష్టిలో పడేందుకు రకరకాల మార్గాల ద్వారా వారు ప్రయత్నాలు చేస్తున్నారు.ఏదోరకంగా జగన్ ఆశీస్సులు సంపాదించి మంత్రి అనిపించుకోవాలని ఆశతో చాలామంది ఉన్నారు.జగన్ ఆశీస్సులతో పాటు ఇప్పుడు మరో అమ్మ ఆశీస్సుల కోసం వైసీపీ నేతలు ఆరాటపడుతున్నారు.
విజయనగరం జిల్లాలో ఉన్న పాపయ్య వలస గ్రామం లో దేవుడమ్మ లలిత అనే మహిళ ఆశీస్సుల కోసం మంత్రి పదవులు ఆశిస్తున్న వారు ఈ గ్రామానికి వస్తున్నారు.2019 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ కు దేవుడమ్మ లలిత గురించి కొంతమంది వైసీపీ నేతలు చెప్పడంతో ఆమె ఇక్కడకు వచ్చారట.అప్పుడే ఆమె వైసీపీ ఈ ఎన్నికల్లో 150 సీట్లు సాధిస్తుందని ఆమె చెప్పడం , ఆ తర్వాత ఫలితాలు కూడా అదే విధంగా వెలువడడంతో అప్పటి నుంచి వైసీపీ నేతలకు దేవుడమ్మ లలిత పై నమ్మకం పెరిగిందట.అప్పటి నుంచి వివిధ పదవులు ఆశిస్తున్నవారు ఈ గ్రామానికి వచ్చి దేవుడమ్మ లలితను దర్శించుకుని, తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఆరా తీస్తున్నారట.
తాజాగా చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈ గ్రామానికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేవుడమ్మ లలిత ఆశీస్సులు పొందేందుకు ఆమె వచ్చారట.ఆమే కాదు మంత్రి పదవి ఆశిస్తున్న ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తో పాటు బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి దేవుడమ్మ లలిత ఆశీస్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది.వీరే కాకుండా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా తన రాజకీయ భవిష్యత్తు పై ఉన్న ఆందోళన నేపథ్యంలో దేవుడమ్మ లలిత ను కలుస్తూ ఇబ్బందులు తొలగించాలని కోరుతూ ఉంటారట.
దసరా ఉత్సవాల సందర్భంగా మూలా నక్షత్రం రోజున తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యే రోజా పాపయ్య వలస రావడం దేవుడమ్మ ను కలవడం, ఆ తర్వాత వారు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లడంతో వీరికి మంత్రి పదవులు తప్పకుండా వస్తాయి అనే విషయాన్ని దేవుడమ్మ లలిత చెప్పారా అందుకే వీరి ముఖాల్లో అంత ఆనందం కనిపించిందా అనే చర్చ ఇప్పుడు మొదలయ్యింది.