వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వలస వెళుతున్న భారతీయులు అన్ని రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.వీరిలో వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా వున్నారు.
తమ అసాధారణ ప్రతిభతో ఆశ్రయం కల్పించిన దేశంతో పాటు జన్మభూమికి సైతం గర్వకారణంగా నిలుస్తున్నారు.ఈ క్రమంలో ఎన్నో అత్యున్నత పురస్కారాలను సైతం సొంతం చేసుకుంటున్నారు.
తాజాగా రాజ్ రెడ్డి అనే ప్రవాస భారతీయుడు ప్రతిష్టాత్మక ట్యూరింగ్ అవార్డుకు ఎంపికయ్యారు.కార్నెగీ మిల్లన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్, రోబోటిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు రాజ్ రెడ్డి.
ట్యూరింగ్ అవార్డును అందుకున్న మొదటి ఆసియా సంతతి వ్యక్తిగా, తొలి భారతీయుడిగా ఆయన రికార్డుల్లోకెక్కారు.కాగా, ట్యూరింగ్ అవార్డును కంప్యూటర్ సైన్స్లో నోబెల్ బహుమతిగా అభివర్ణిస్తారు.
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన రాజ్ రెడ్డి పూర్తి పేరు దబ్బల రాజగోపాల్ రెడ్డి.1937 జూన్ 13న ఆయన జన్మించారు.ఆయన తాత ఒక భూస్వామి అయితే దాన ధర్మాల వల్ల వారి ఆస్తి కరిగిపోయింది.రాజ్ రెడ్డి తన గ్రామంలోని పాఠశాలలోనే ఇసుకలో అక్షరాలు నేర్చుకున్నారు.ఐదో తరగతి దాకా అదే ఊళ్ళో చదివిన ఆయన.ఆరో తరగతి నుంచి పదో తరగతి దాకా శ్రీకాళహస్తిలో చదివారు.పదో తరగతిలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడవ్వడంతో మద్రాసు లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ చదవడానికి అవకాశం వచ్చింది.పదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే చదివిన రాజ్ రెడ్డికి… ఒక్కసారిగా ఆంగ్ల మాధ్యమంలో చదవాల్సి రావడంతో కొంచెం ఇబ్బంది పడ్డాడు.
అయినప్పటికీ మొక్కవోనీ దీక్షతో ఆంగ్లం మీద పట్టు తెచ్చుకున్నారు.అనంతరం ప్రతిభ, మౌఖిక పరీక్ష ఆధారంగా మద్రాసు విశ్వవిద్యాలయానికి చెందిన గిండీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (ప్రస్తుతం అన్నా విశ్వవిద్యాలయం) నుంచి సివిల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్స్ పట్టా సంపాదించారు.
చదువు తర్వాత మద్రాసు పోర్టు ట్రస్టులో ఇంజనీరుగా ఉద్యోగం వచ్చింది.అయితే రాజ్రెడ్డికి విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలని కోరిక.
దీంతో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆస్ట్రేలియాలోని విద్యాసంస్థల్లో సీటు కోసం దరఖాస్తు చేశాడు.అలా 1960 లో ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడి న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ సంపాదించారు.
ఆ సమయంలోనూ కంప్యూటర్లపై మక్కువ పెంచుకున్నారు రాజ్ రెడ్డి.ఈ ఇష్టంతోనే ప్రఖ్యాత ఐబీయంలో చేరి మూడేళ్ళపాటు పనిచేసి కంప్యూటర్ రంగంలో అపార అనుభవాన్ని సంపాదించారు.
కంప్యూటర్పై విస్తృత పరిశోధనలు చేయాలన్న లక్ష్యం అమెరికాలోని స్టాన్ఫోర్డ్ వర్సిటీలో పీ.హెచ్.డీకి దరఖాస్తు చేసి… 1966 కంప్యూటర్ సైన్స్లో డాక్టరేటు సంపాదించారు .అంతేకాదు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో మొట్టమొదటి డాక్టరేట్ అందుకున్న ఘనత రాజ్రెడ్డిదే.
అదే ఏడాది స్టాన్ ఫోర్ట్ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా అధ్యాపక వృత్తిని ప్రారంభించిన ఆయన… తరువాత పిట్స్ బర్గ్ లోని కార్నెగీ మిలాన్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా చేరాడు.అక్కడే కృత్రిమ మేధస్సు రంగం ప్రపంచాన్ని శాసిస్తుందని ఊహించి ఆ దిశగా తన దృష్టి మళ్ళించాడు.కార్నెగీ మిలన్ యూనివర్సిటీ కంప్యూటర్ విభాగానికి డీన్గా కూడా రాజ్రెడ్డి వ్యవహరించారు.
అయితే తన సేవలు మాతృదేశానికి కూడా అందించాలనే ఉద్దేశ్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో ఆయన విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీల ఏర్పాటుకు మార్గదర్శిగా, పాలక మండలి అధ్యక్షుడిగా వ్యవహరించేందుకు రాజ్రెడ్డి అంగీకరించారు.
ఆయన సేవలకు గుర్తింపుగా అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు మిట్టరాండ్ స్వయంగా అమెరికా వచ్చి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారమైన లీజియన్ ఆఫ్ ఆనర్ను ప్రదానం చేశారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్, కంప్యూటర్ సైన్స్, స్పీచ్ రికగ్నిషన్లో చేసిన కృషికి గాను రాజ్ రెడ్డికి కంప్యూటర్ హిస్టరీ మ్యూజియం (సిహెచ్ఎం) 2021 ఫెలో అవార్డును ప్రదానం చేశారు
.