అమెరికా పర్యటనలో బిజిబీజిగా వున్న కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ.మురళీధరన్ బుధవారం కనెక్టికట్ నగరంలో ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని వారితో కలిసి జరుపుకున్నారు. న్యూ ఇండియా గ్రోత్ స్టోరీలో భాగస్వామి కావడానికి ఉత్సాహంగా వున్న కనెక్టికట్లోని డైనమిక్ ఇండియన్ కమ్యూనిటీతో చర్చలు జరిగాయి అని మురళీధరన్ ట్వీట్లో పేర్కొన్నారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు నిండిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమం కింద వరుస వేడుకలను కూడా జరుపుతున్నారు.
అంతకుముందు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో Peacebuilding and sustaining peace: Diversity, state building and the search for peace’ అనే అంశంపై అత్యున్నత స్థాయి చర్చా కార్యక్రమంలో కేంద్రమంత్రి మురళీధరన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
ఆఫ్రికాలో పెరుగుతున్న ఉగ్రవాద ముప్పుపై ఆందోళన వ్యక్తం చేశారు.అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఇటీవలి నాయకత్వ మార్పు గురించి కూడా మురళీధరన్ ప్రస్తావించారు.
ఆఫ్రికాలో తీవ్రవాద కార్యకలాపాలను చట్టబద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్న కొన్ని దేశాలు, తీవ్రవాద శక్తుల నుంచి ఉగ్రవాదులు సాయం పొందుతున్నారని మురళీధరన్ ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిజం స్ట్రాటజీ (జీసీటీఎస్) ఏ కారణంతోనూ ఉగ్రవాదం సమర్ధించబడదన్న విషయాన్ని స్పష్టం చేశారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలలో, ప్రత్యేకించి ఆఫ్రికా, ఆసియా దేశాలలో శాంతిని నెలకొల్పే సందర్భంలో భారతదేశం ఎల్లప్పుడూ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని మురళీధరన్ స్పష్టం చేశారు.నిధులను అందించడం ద్వారా దేశాలకు సాయం చేస్తూనే వుందని కేంద్రమంత్రి గుర్తుచేశారు.
ఇక ఉగ్రవాదం, అఫ్గానిస్తాన్లోని పరిణామలపై మంగళవారం జీ-20 దేశాధినేతలతో జరిగిన వర్చువల్ భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు.పరిస్థితులను చక్కదిద్దేందుకు ఏకీకృత ప్రతిస్పందన అవసరమని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపు నిచ్చారు.ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఉగ్రవాద, తీవ్రవాద శక్తులకు అఫ్గాన్ గడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ స్థావరంగా మారరాదని ప్రధాని అభిప్రాయపడ్డారు.ఆకలి, పోషకాహార సమస్యతో అల్లాడుతున్న ఆఫ్గన్ పౌరులకు తక్షణమే సాయం అందించాలని మోడీ కోరారు.20 ఏళ్లుగా ఆఫ్గన్ సమాజం సాధించిన అభివృద్ధిని కొనసాగించేందుకు తాలిబన్ల పాలనలో మహిళలు, మైనారిటీలకు వీలు కల్పించాలని ప్రధాని అభిప్రాయపడ్డారు.