ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో మగవారికి పోటాపోటీగా ఆడవారు రాణిస్తున్నారు.మగవారికి తామేం తక్కువ కాదని నిరూపిస్తూ తల్లిదండ్రులకు గర్వ కారణం అవుతున్నారు.అయినప్పటికీ కొందరు తల్లిదండ్రులు తమకు మగబిడ్డే పుట్టాలని ఆకాంక్షిస్తున్నారు.తమకు పుట్టబోయే బిడ్డ లింగం తెలుసుకోవడానికి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.అమ్మాయి పుడితే అదృష్టమని.సాక్షాత్తు లక్ష్మి దేవత పుట్టిందని చాలా మంది సంతోషపడతారు.
కానీ మిగతా వారు మాత్రం మూస పద్ధతి ఆలోచనలతో మానసికంగా కృంగిపోతున్నారు.ఇప్పటికైనా ఇలాంటి ఆలోచనలను వీడి పుట్టే బిడ్డలను లింగ వివక్షతో చూడకుండా ఉంటే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆడా మగా అనేది తెలుసుకోవడానికి పరీక్షలు, గేమ్స్ జరుగుతుంటాయి.ఐతే తాజాగా దుబాయ్లోని బుర్జ్ అల్ అరబ్ హోటల్ సమీపంలోని బీచ్లో జరిగిన ఒక జండర్ రివీల్ గేమ్ అనేక విమర్శలకు దారితీస్తోంది.
ఈ గేమ్ బంధుమిత్రుల సమక్షంలో ఒక పార్టీలా నిర్వహించడం గమనార్హం.ఈ ఆటలో పింక్, బ్లూ కలర్స్ నింపిన కొన్ని బెలూన్స్ ఎగరవేస్తారు.సాధారణంగా ఈ ఆటలో అతిథులతో బెలూన్స్ పెల్చేసి అందులోని రంగును బట్టి ఆడా మగా అనేది అంచనా వేస్తుంటారు.పింక్ కలర్ వస్తే అమ్మాయి అని బ్లూ కలర్ వస్తే అబ్బాయి అని భావిస్తుంటారు.
అయితే దుబాయ్ దంపతులు తమ అతిథులకు బదులు ఏకంగా ఒక పులి చేతే ఆట ఆడించారు.ఈ పులిని బీచ్ లో బెలూన్లు కట్టిన ఓ ప్రదేశంలో వదిలేశారు.
అప్పుడు ఆ పులి ఒక బెలూన్ పగులగొట్టగా అందులోనుంచి పింక్ కలర్ బయటపడింది.దీన్నిబట్టి తమకు పుట్టబోయేది అమ్మాయి అని దంపతులు అంచనా వేస్తున్నారు.
అయితే ఈ తతంగానికి సంబంధించిన వీడియోని కార్లోటా కావల్లారి అనే ఓ నెటిజన్ ఆన్లైన్లో షేర్ చేశారు.‘పులికి ఎలాంటి హాని జరగలేదు.బెలూన్ల ప్లాస్టిక్ కూడా పారేసాం’ అని ఆమె ఈ వీడియో పోస్ట్ కి కాప్షన్ జోడించారు.ఈ వీడియోని ‘లోవిన్ దుబాయ్’ అనే ఓ ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా షేర్ చేసింది.
అప్పట్నుంచి ఇది తెగ వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన జంతు ప్రేమికులు ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు.“మీ ఆనందం కోసం పైశాచిక ఆట ఆడిస్తూ మూగ జంతువులను ఎందుకు బాధ పెడుతున్నారు” అంటూ చాలా మంది జంతు ప్రేమికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఆడా, మగా తెలుసుకోవడానికి ఇలాంటి చెత్త ఆటలు కూడా ఆడతారా.
ఇది చాలా అసహ్యంగా ఉందని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.