రైతులు పంటలు పండించడానికి ఎంత కష్టపడతారో ఆ పంటను కాపాడుకునేందుకు కూడా అంతే కష్టపడుతుంటారు.అయితే దాని కోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.
పొలాల్లో కాపలాకి మనిషి ఉండడం, దిష్టిబొమ్మ పెట్టడం, చెట్టుకు సీసా కట్టి దాని పక్కకు ఇనుపకడ్డీ కట్టి చప్పుడు వచ్చేలా చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.అయినా ఇంకా పంట సాగు సులభతరం అవ్వడం కోసం జంతువులు పక్షుల నుంచి పంటలను కాపాడుకోవడం కోసం వినూత్న ఆలోచనలు, ఇంకా ఏవేవో కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ఆ కొత్త ప్రయత్నాల్లో కొద్ది రోజుల క్రితం పంటను రక్షించుకోవడం హీరోయిన్ బొమ్మలు పెట్టారు.అలాగే తాజాగా ఓ రైతు కూడా వినూత్నంగా ఆలోచన చేశాడు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన ముండే సాయి కిరణ్ అనే యువ రైతు పక్షుల నుండి, జంతువుల నుండి తన పంటను కాపాడుకునేందుకు హర్రర్ బొమ్మను తయారు చేశాడు.దానికోసం ఓ సైకిల్ హ్యాండిల్, ఒక డబ్బా , ఒక పైపు, ఒక స్ప్రింగ్ తో జోడించిన సైకిల్ హ్యాండిల్ డబ్బాకు ఓ పాత అంగిని తొడిగించి బొమ్మను అమర్చి స్టాండ్ ను ఏర్పాటు చేశారు.
గాలి వీచినప్పుడల్లా ఈ బొమ్మ తనకు తాను అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది.దీంతో పంట పొలాల్లో పక్షులు, జంతువులు ఈ బొమ్మ ఊగడం చూసి భయపడి పంట పొలాల్లోకి రాకుండా దూరంగా ఉంటాయి అని ఆ యువ రైతు చెప్పుకొచ్చాడు.
అయితే ఈ హర్రర్ బొమ్మ తయారీ కోసం కేవలం 900 రూపాయలు మాత్రమే తాను ఖర్చు పెట్టానని, ఒకవేళ ఎవరికైనా ఇలాంటి బొమ్మ కావాల్సి వస్తే తాను తయారు చేసి ఇస్తానని యువ రైతు ముండే సాయి కిరణ్ తెలిపారు.