ఎన్నో ఆశలు, ఆకాంక్షల మధ్య జనవరి 20న అగ్రరాజ్యానికి కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.తనదైన నిర్ణయాలతో అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించారు.
పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి దేశాన్ని వణికిస్తున్న కరోనాపై పోరుకు దిగిన బైడెన్.పకడ్బందీ చర్యలతో అమెరికాను వైరస్ గండం నుంచి గట్టెక్కించగలిగారు.
వ్యాక్సినేషన్ను పెద్ద ఎత్తున చేపట్టి జూలై 4న స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు కరోనా విముక్తి దినం పేరిట ఉత్సవాలను సైతం జరిపించారు.ఇక ట్రంప్ కాలంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను ఒక్కొక్కటిగా సరిచేస్తూ అమెరికన్లకు ఆశాదీపంలా మారారు.
అలాంటి వ్యక్తి ఒకే ఒక్క నిర్ణయంతో తన ప్రతిష్టను దిగజార్చుకున్నారు.
ఆఫ్గనిస్థాన్లో మళ్లీ తాలిబన్ల రాజ్యం ఏర్పడటానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
అమెరికా-నాటో దళాల ఉపసంహరణ ద్వారా తాలిబన్ల చేతికి దేశాన్ని అప్పజెప్పాడంటూ ఆఫ్గన్ ప్రభుత్వం-ప్రజలు సైతం బైడెన్పై దుమ్మెత్తి పోశారు.మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం బైడెన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ఇదే సమయంలో ఆయన పట్ల అమెరికన్ల ఆలోచనల్లోనూ మార్పు కనిపిస్తోంది.దీని ఫలితంగానే బైడెన్ పాపులారిటీ క్రమంగా క్షీణిస్తూ వస్తోంది.
తాజాగా ఆయన జాబ్ అప్రూవల్ రేటు గడిచిన రెండు నెలల్లో బాగా పడిపోయిందని ప్యూ రీసెర్చ్ సెంటర్ పరిశోధనలో తేలింది.
అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ పనితీరును అమెరికా వయోజనులలో సగం కంటే తక్కువ మంది (44 శాతం) ఆమోదించగా, 53 శాతం మంది నిరాకరించారు.
గత జూలై నుంచి బైడెన్ పనితీరు క్షీణిస్తూ వస్తోంది.అప్పట్లో ఆయనను 55 శాతం మంది సమర్ధించగా.43 శాతం మంది తిరస్కరించారు.బైడెన్ వ్యక్తిత్వం, సమర్థత, విధాన నిర్ణయాలు పాపులారిటీపై ప్రభావం చూపుతున్నాయి.
అమెరికాలో కరోనా తీవ్రతను తగ్గించడంలో బైడెన్ సమర్ధంగా పనిచేశారని 51 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.కానీ మార్చిలో ఇది 65 శాతంగా వుండేది.అటు బైడెన్ ఆర్ధిక, విదేశాంగ, ఇమ్మిగ్రేషన్ నిర్వహణపైనా ఆయన తన విశ్వాసాన్ని కోల్పోతున్నారు.ఇక దేశాన్ని ఏకం చేసే విషయంలోనూ ఆయన ప్రజా మద్ధతు క్షీణిస్తోంది.
ఈ విషయంలో కేవలం 34 శాతం మంది మాత్రమే బైడెన్కు అండగా నిలబడుతున్నారు.