ఎప్పటి నుంచో టిడిపి జనసేన పార్టీలో పొత్తు వ్యవహారం తెరపైకి వస్తూనే ఉంది.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన కు దగ్గర అయ్యేందుకు రకరకాల మార్గాల్లో ప్రయత్నాలు చేస్తోంది.2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే జగన్ అధికారానికి దూరం చేయవచ్చు అనే ఆలోచనతో బీజేపీకి దగ్గరయ్యేందుకు టిడిపి ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు జనసేన ను తమ వైపుకి తిప్పుకునేందుకు సంకేతాలు ఇస్తోంది.అయినా జనసేన నుంచి పెద్దగా రెస్పాన్స్ అయితే కనిపించడం లేదు.
ఈ ప్రయత్నం ఇలా ఉండగానే ఇటీవల విడుదలైన ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు అక్కడక్కడా గెలిచారు.అయితే టిడిపి కూడా కొన్నిచోట్ల గెలవడంతో జనసేన టిడిపి కలిసి ఉమ్మడిగా ఎంపిపి లను కైవసం చేసుకున్నాయి.
ఈ మేరకు స్థానిక టిడిపి జనసేన నాయకులు ఒక అంగీకారానికి వచ్చారు.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే వైసీపీని అధికారానికి దూరం చేయడం పెద్ద కష్టమేమీ కాదు అనే అభిప్రాయం రెండు పార్టీల నాయకులలోనూ వచ్చింది.
అయితే ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించడం లేదు.ఇక టిడిపి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వంటివారు జనసేన టిడిపి కలవాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం టిడిపి ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా పొత్తు ఉంటేనే 2024 ఎన్నికల్లో విజయం సాధ్యం అవుతుందనే నమ్మకంతో టిడిపి సీనియర్ నాయకులు ఉన్నారు.అయితే గతంలో టిడిపికి జనసేన మద్దతు ఇచ్చినా, తర్వాత కొంతకాలానికి టిడిపి నాయకులు పవన్ ను హేళన చేస్తూనే మాట్లాడారు.
అసలు పవన్ ఎవరో తమకు తెలియదు అన్నట్లుగానే టిడిపి సీనియర్లు కామెంట్స్ చేయడం వంటివి పవన్ కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి.
ఇప్పుడు మళ్లీ టిడిపి పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, అప్పటి సంఘటనలు అడ్డుగోడగా మారినట్టు కనిపిస్తున్నాయి.అయితే టిడిపి, జనసేన కలిసి పోటీ చేసే అధికారాన్ని చేజిక్కించుకుంటే జనసేనకు గౌరవప్రదమైన స్థానం కల్పించడంతో పాటు, పవన్ కు ఉప ముఖ్యమంత్రి ఇచ్చేందుకు , ఆయన పార్టీకి చెందిన వారికి మరికొన్ని మంత్రి పదవులు ఇచ్చేందుకు టిడిపి సిద్ధమైనా, జనసేన స్పందించడం లేదు.ఈ క్రమంలో రెండున్నర సంవత్సరాలు అధికారాన్ని పంచుకోవాలనే ప్రతిపాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది.
టీడీపీలోని ఒక వర్గం ఈ ప్రతిపాదనను తీసుకు వచ్చింది.అయితే ఈ విషయంలో పవన్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనే దానిపైనే రెండు పార్టీలు పొత్తు ఆధారపడి ఉంటుంది.