తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బిజెపి చేయని ప్రయత్నం లేదు.గతంతో పోలిస్తే పార్టీ పరిస్థితి కాస్త మెరుగైంది.
తెలంగాణలో టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా ఉండే కాంగ్రెస్ బలహీనపడింది.బిజెపి బాగా బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది.
దీనికితోడు టిఆర్ఎస్ ప్రభుత్వం పై పెరిగిన వ్యతిరేకత ఇవన్నీ బిజెపికి కలిసి వచ్చాయి.తప్పనిసరిగా 2023 ఎన్నికల్లో అధికారంలోకి వస్తాము అనే ధీమా లో ఉంటూ వచ్చింది.
బిజెపికి పెరిగిన ఆదరణ, టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఇవన్నీ అధికారంలో కూర్చోబెడతాయి అనే నమ్మకంతో కమలనాథులు ఉంటూ వచ్చారు.అయితే రేవంత్ రెడ్డి రూపంలో ఆ ఆశలకు గండి పడే అవకాశం కనిపిస్తోంది.
బలహీనంగా ఉన్న కాంగ్రెస్ ను బలోపేతం చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతూ వస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి రేవంత్ మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.
దీంతో మళ్లీ బీజేపీ కి కష్టాలు మొదలయ్యాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసి, బలమైన అభ్యర్థులను పోటీకి దింపితే తమకు అధికారం దక్కుతుందనే నమ్మకం తో తెలంగాణ బిజెపి నాయకులు ఉన్నారు.
ఈ మేరకు ఇప్పటి నుంచే అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ పరిస్థితిపై ఒక అంచనాకు వస్తూ, ఆయా నియోజకవర్గల్లో ఎవరిని అభ్యర్థిగా నిలబెడితే బాగుంటుందనే విషయంపై దృష్టి పెట్టారు.
ఈ మేరకు కేంద్రం హోంమంత్రి అమిత్ షా , తెలంగాణ నేతలకు హితబోధ చేసినట్లు సమాచారం .అయితే బిజెపి కి 119 నియోజకవర్గాల్లో బలమైన నాయకులు లేరు.దాదాపు 70 నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్య ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు.
ఆ పరిస్థితిని మార్చి 119 నియోజకవర్గాల్లోనూ బలమైన, స్థానికంగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న వారిని అభ్యర్థులుగా నిలబడితే తమ పార్టీ అధికారంలోకి రావడం కష్టమేమీ కాదు అన్న అభిప్రాయానికి తెలంగాణ బిజెపి నాయకులు వచ్చారు.దీనికోసం ఇతర పార్టీల్లోని నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకోవడం ద్వారా, ఆ సమస్యను తీర్చుకోవచ్చు అనే అభిప్రాయానికి వచ్చారు.
మరికొద్ది రోజుల్లోనే ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలు పెట్టాలని, బలమైన నేతలు పార్టీలో చేర్చుకునే విషయంలో కేంద్ర బిజెపి పెద్దల సహకారం కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నారట.ప్రస్తుతం తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు.
అది పూర్తికాగానే చేరికల విషయంపై దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.