చాలా కాలం నుంచి ఏపీ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుల మధ్య వర్గ పోరు , ఆధిపత్యపోరు నెలకొన్న సంగతి తెలిసిందే.ఎప్పుడు లేని విధంగా ఒకరి పై ఒకరు సొంత పార్టీ నేతల పైన విమర్శలు చేసుకుంటూ రావడం టిడిపిలో పరిపాటిగా మారింది.
ప్రస్తుతం టీడీపీ నుంచి ఒక్కో సీనియర్ నేత రాజకీయాలకు స్వస్తి పలుకుతున్న తీరు ఆ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది.ఇదిలా ఉంటే తాజాగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఆయన తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాకుండా పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలిగే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.ఇదే విషయాన్ని చంద్రబాబు వద్ద కూడా ఆయన ప్రస్తావించినట్లు సమాచారం.
అయితే నాని రాజకీయాలకు దూరం అయినా, ఆయన కుమార్తె కేసినేని శ్వేతను పొలిటికల్ గా యాక్టిివ్ చేయడంతో పాటు, కీలక స్థానం లో కూర్చోబెడతారు అనే ప్రచారం జరిగింది.అయితే నాని మాత్రం తాను మాత్రమే కాదని, తన కుమార్తె కూడా పూర్తిగా రాజకీయాలకు దూరం కాబోతున్నారు అంటూ ప్రకటించారు.
తన కుమార్తె శ్వేతను విజయవాడ మేయర్ గా చేయాలని నాని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు.ఆమె కార్పొరేటర్ గా గెలిచినా, టిడిపి కార్పొరేషన్ లో ఓటమి చెందడంతో, శ్వేత కూడా పొలిటికల్ గా యాక్టివ్ గా లేరు.
గతంలో ఆమె టాటా ట్రస్ట్ లో కీలక ఈ విభాగంలో పని చేసేవారు.
మళ్లీ ఇప్పుడు ఆమె ఆ ట్రస్ట్ లో పని చేసేందుకు వెళ్లిపోయారని, రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది.ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడే నానికి సొంత పార్టీలోనే శత్రువులు ఎక్కువ అయ్యారని, ఇది రాజకీయంగా ఇబ్బందులు తెచ్చి పెట్టడంతో పాటు , టీడీపీలో వర్గపోరు తీవ్రమైన అవ్వడం, ముఖ్యంగా పార్టీ లోని బుద్ధ వెంకన్న, బోండా ఉమా వంటి వారు తన పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం వంటి వ్యవహారాలపై అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా, వారినే వెనకేసుకొచ్చినట్టు గా వ్యవహరిస్తుండడం, ఇలా చాలా అంశాలతో ఆయన విసిగిపోయారని , అందుకే టిడిపి తో పాటు, పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలగాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.