అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన ఒక భారతీయ అమెరికన్ 2 మిలియన్ డాలర్ల విలువైన పీపీఈ కిట్లకు సంబంధించిన మోసానికి పాల్పడ్డట్టు నేరాన్ని అంగీకరించినట్లు యూఎస్ అటార్నీ తెలిపారు.గౌరవ్జిత్ సింగ్ (26) యూఎస్ జిల్లా కోర్టు న్యాయమూర్తి పీటర్ జీ.
షెరిడాన్ ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విచారణలో తన నేరాన్ని ఒప్పుకున్నాడు.ఇందుకు శిక్షగా గౌరవ్జిత్ గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష 2,50,000 డాలర్ల జరిమానా లేదా రెండూ ఎదుర్కోవచ్చు.లేని పక్షంలో మోసపూరితంగా అతను సంపాదించిన దానికి రెట్టింపు మొత్తాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించవచ్చు.2022 ఫిబ్రవరి 10న గౌరవ్జిత్కు శిక్ష ఖరారుకానుంది.
కోర్టు పత్రాల ప్రకారం. అమెరికాలో కోవిడ్ 19 తీవ్రత ఎక్కువగా వున్న మే 2020 సమయంలో గౌరవ్ 10 బాధితుల నుంచి వ్యక్తిగత రక్షణ పరికాలు (పీపీఈ) కిట్లు అందజేస్తానని చెప్పి 2 మిలియన్ డాలర్ల మేర మోసానికి పాల్పడ్డాడు.
వారికి పీపీఈ కిట్లు పంపకుండా ఆ డబ్బును వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేశాడు గౌరవ్.
మరోవైపు కరోనాను అడ్డంపెట్టుకుని అమెరికా ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయాన్ని దొడ్డిదారిన సంపాదిస్తున్నారు పలువురు అక్రమార్కులు.
వీరిలో పలువురు భారతీయులు కూడా వుండటం దురదృష్టకరం.మహమ్మారి వల్ల ఆర్ధికంగా, సామాజికంగా ఎంతో నష్టపోయిన అమెరికన్లను ఆదుకునేందుకు గాను జో బైడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక ప్యాకేజ్ను ప్రకటించిన సంగతి తెలిసిందే.‘ద అమెరికన్ రెస్క్యూ ప్లాన్’ పేరుతో ప్రకటించిన ఈ బిల్లుకు ఇటీవల సెనేట్, అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం తెలిపాయి.
దీంతో ఈ ప్యాకేజ్ ఫలాలను ప్రజలకు పంచడం ప్రారంభించింది ఫెడరల్ ప్రభుత్వం.ఈ నిధులతో కరోనా పరీక్షల నిర్వహణ, టీకా కార్యక్రమాలతో పాటు.పౌరులకు నేరుగా ఆర్థిక సాయం, చిరు వ్యాపారులకు అండగా నిలవడం వంటి కార్యక్రమాలు చేపడతామని బైడెన్ ఇప్పటికే తెలిపారు.
అయితే బైడెన్ కంటే ముందే అధ్యక్షుడిగా వ్యవహరించిన డొనాల్డ్ ట్రంప్ చిన్న, సూక్ష్మతరహా వ్యాపారాలను ఆదుకోవడానికి గాను ‘‘పే చెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం’’ అనే రిలీఫ్ స్కీమ్ను గతేడాది ప్రారంభించారు.
దీని ద్వారా వ్యాపారాలను నిలబెట్టడంతో పాటు ఆయా సంస్ధల్లో పనిచేసే కార్మికులు రోడ్డున పడకుండా వారికి వేతనాలు చెల్లించాలన్నది ఈ పథకం ముఖ్యోద్దేశం.అయితే చిరు వ్యాపారులకు కాస్తయినా ఉపశమనం కలిగించాలన్న ప్రభుత్వ ఆలోచనను కొందరు మోసగాళ్లు తమ స్వార్ధానికి ఉపయోగించుకుంటున్నారు.టెక్సాస్లో స్థిరపడిన దినేష్ షా అనే ఇండో అమెరికన్ కొవిడ్ రిలీఫ్ స్కీమ్లో 24.8 మిలియన్ డాలర్లు (రూ.180 కోట్లు) మోసానికి పాల్పడినట్లు ఇటీవల అమెరికా న్యాయ శాఖ తేల్చింది.